బంగ్లాదేశ్ తో చెన్నయ్ లో జరుగుతున్న తొలిటెస్టులో భారత్ విజయం దిశగా దూసుకుపోతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 158 పరుగులతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. లక్ష్యానికి ఇంకా 357 పరుగుల దూరంలో ఉంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. నాలుగో రోజు లాంఛనం పూర్తవుతుందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
టీమ్ ఇండియా ఓవర్ నైట్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 81 పరుగులుతో మూడో రోజు ఆట ప్రారంభించింది. శుభ్ మన్ గిల్ (33), రిషబ్ పంత్ (12) ఇద్దరూ సాధికారికంగా ఆడి సెంచరీలు చేశారు. పంత్ అయితే వన్డే తరహాలో ధనాధన్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. 128 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
అనంతరం శుభ్ మన్ గిల్ కూడా ఈ ఇన్నింగ్స్ జీవన్మరణ పోరాటంగా భావించి ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లో డక్ అవుట్ కావడంతో …పట్టుదలగా ఆడాడు. 176 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 119 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. చివరికి కేల్ రాహుల్ (22) సాయంతో స్కోరుని 287 పరుగులకి చేర్చాడు. అప్పటికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలిపి 514 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా దేశ్ చేతిలో ఉంచి డిక్లేర్ చేసింది.
దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఓపెనర్లు ఆత్మవిశ్వాసంతోనే ఆడారు. ఆట ప్రారంభమైన 16 ఓవర్ల వరకు వికెట్ పడలేదు. అప్పటికి స్కోరు 62 పరుగులు ఉంది. ఏదేమైనా టీమ్ ఇండియా పొరపాటు చేసిందా? అని అంతా అనుకున్నారు. అప్పుడు ఆపద్భాందవుడు బుమ్రా బ్రేక్ ఇచ్చాడు. ఓపెనర్ జకీర్ హుసేన్ (33) వికెట్ పడగొట్టాడు.
తర్వాత మరో ఓపెనర్ షాద్మాన్ ఇస్లాం (35) వికెట్ ను అశ్విన్ పడగొట్టాడు. అనంతరం మోమిన్యుల్ (13), ముస్ఫిర్ రహిం (13) వికెట్లు కూడా అశ్విన్ తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో కదం తొక్కి ఇండియాను కాపాడిన అశ్విన్, రెండో ఇన్నింగ్స్ లో బౌలింగుతో అదరగొట్టి బంగ్లా దూకుడికి కళ్లెం వేశాడు.
దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. బంగ్లా చేతిలో ఇంకా 6 వికెట్లు ఉన్నాయి. కెప్టెన్ నజ్ముల్ హుసైన్ (51) నాటౌట్ గా నిలిచాడు. ఒంటరిపోరాటం చేస్తున్నాడు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. టీమ్ ఇండియా బౌలింగులో బుమ్రా 1, అశ్విన్ 3 వికెట్లు పడగొట్టారు.