IND Vs AUS : విరాట్ కోహ్లీ తన సూపర్ ఫామ్ ను కొనసాగించాడు. ఆస్ట్రేలియాపై వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లోనూ కింగ్ రాణించాడు. 81 పరుగులకే జట్టు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో జట్టును ఆదుకున్నాడు. క్రీజులో పాతుకుపోయి .. సింగిల్ తీస్తూ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. పిచ్ బౌలింగ్ కు అనూకూలంగా ఉండటంతో పరుగులు రావడం గగనమైంది. దీంతో విరాట్ సింగిల్స్ పైనే దృష్టి పెట్టాడు.
మరోవైపు కేఎల్ రాహుల్ నుంచి కోహ్లీకి మంచి సహకారం లభించింది. ఇద్దరూ కూడా వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు.దీంతో 16.2 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా రాలేదు. 10వ ఓవర్ చివరి బంతికి శ్రేయాస్ అయ్యర్ బౌండరీ కొట్టిన తర్వాత చాలా సేపు బౌండరీ పడలేదు. చివరికి 26.2 ఓవర్ల వద్ద రాహుల్ .. మాక్స్ వెల్ బౌలింగ్ లో బౌండరీ కొట్టాడు. అంటే 98 బంతులపాటు టీమిండియా బ్యాటర్లు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయారు.
రోహిత్ దూకుడుతో తొలి పది ఓవర్లలో రన్ రేట్ 8గా ఉంది. కానీ తర్వాత రన్ రేట్ పడిపోయింది. తొలి 10 ఓవర్లకు 80 పరుగులు చేసిన భారత్ రెండు వికెట్లు ( గిల్ , రోహిత్) కోల్పోయింది. 11-20 ఓవర్ల మధ్య 35 పరుగులు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో మరో వికెట్ ( శ్రేయాస్ అయ్యర్ )కోల్పోయింది. 21-30 ఓవర్ల మధ్య 37 పరుగులు చేసిన టీమిండియా విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయింది. 10 ఓవర్ల తర్వాత పరుగులు చేయడం కష్టంగా మారింది. అంటే 120 బంతుల్లో 72 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇందులో ఒకే ఒక్క బౌండరీ ఉంది.
స్కోర్ వేగంగా పెరుగుతున్న క్రమంలో కోహ్లీ ( 54, 63 బంతుల్లో 4 ఫోర్లు) ను ఆసీస్ కెప్టెన్ కమిన్స్ బౌల్డ్ చేశాడు. 4వ వికెట్ కు కోహ్లీ, రాహుల్ కలిసి 67 పరుగులు జోడించారు.