IND Vs AUS : ఆస్ట్రేలియా, భారత్ దిగ్గజ క్రికెటర్లు అలెన్ బోర్డర్ , సునీల్ గావస్కర్ పేరిట ఇరుజట్ల మధ్య 1996 నుంచి టెస్టు సిరీస్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రోఫీ కోసం ఇరుజట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. బోర్డర్- గావస్కర్ సిరీస్ లో ఓవరాల్ గా భారత్ దే ఆధిపత్యం ఉంది. భారత్లో నిర్వహించిన తొలి సిరీస్ ను టీమిండియా దక్కించుకుంది. ఆ తర్వాత అదే జోరు కొనసాగిస్తోంది. తాజాగా జరిగే 4 టెస్టుల సిరీస్ ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో రోహిత్ సేన బరిలోకి దిగుతోంది.
భారత్ దే ఆధిపత్యం..
బోర్డర్ -గావస్కర్ ట్రోఫి ఇప్పటివరకు 15 సార్లు నిర్వహించారు. అందులో భారత్ 9 సార్లు విజేతగా నిలిచింది.
ఆస్ట్రేలియా 5 సార్లు సిరీస్ సాధించింది. 2003/04లో జరిగిన సిరీస్ మాత్రం డ్రాగా ముగిసింది. చివరిగా జరిగిన 3 సిరీస్ ల్లో టీమిండియానే గెలుపొందింది. భారత్లో బోర్డర్-గావస్కర్ ట్రోఫీని 8 సార్లు నిర్వహించగా.. ఆసీస్ ఒక్కసారి 2004/05 మాత్రమే విజేతగా నిలిచింది.
అత్యధిక పరుగుల వీరులు..
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో సచిన్ అత్యధికంగా 3,262 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆసీస్ తరఫున అత్యధికంగా రికీ పాంటింగ్ 2,555 పరుగులు సాధించాడు. పాటింగ్ 8 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు బాదాడు. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో భారత్ తరఫున 1,893 పరుగులతో ఛెతేశ్వర్ పుజారా, ఆసీస్ తరఫున స్టీవ్ స్మిత్ 1,742 పరుగులతో టాప్ లో ఉన్నారు.
అత్యధిక వ్యక్తిగత స్కోరు
ఈ సిరీస్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు ఆసీస్ మాజీ సారథి మైఖేల్ క్లార్క్ పేరిట ఉంది. 2012 జనవరిలో సిడ్నీలో జరిగిన మ్యాచ్లో క్లార్క్ 329 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ తరఫున 2001లో కోల్ కతా ఈడెన్ గార్డెన్స్లో వీవీఎస్ లక్ష్మణ్ 281 పరుగులతో చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు.
ఎక్కువ వికెట్లు తీసింది ఎవరంటే?
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో అనిల్ కుంబ్లే అత్యధికంగా 111 వికెట్లు పడగొట్టాడు. హర్భజన్ సింగ్ 95 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆసీస్ తరఫున నాథన్ లైయన్ 94 వికెట్ల తీశాడు. ఈ ముగ్గురూ స్పిన్నర్లే కావడం విశేషం.
ఓవరాల్ గా ఆసీస్ దే ఆధిపత్యం
మొత్తంగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య 27 టెస్టు సిరీస్లు జరిగాయి. అందులో ఆస్ట్రేలియా 12, భారత్ 10 సిరీస్ లు గెలిచాయి. మరో 5 టెస్టు సిరీస్ లు డ్రాగా ముగిశాయి. ఆస్ట్రేలియాతో భారత్ మొత్తం 102 టెస్టులు ఆడింది. అందులో 30 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. మరో 43 మ్యాచ్ల్లో పరాజయం పాలైంది. ఒక మ్యాచ్ టైగా అయ్యింది. మరో 28 టెస్టులు డ్రాగా ముగిశాయి.