IND Vs AUS : అహ్మదాబాద్ వేదికగా భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే నాలుగో టెస్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ లో తొలి రెండు టెస్టుల్లో భారత్ జయభేరి మోగించింది. అయితే ఇండోర్ లో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ అనూహ్య విజయం సాధించింది. దీంతో సిరీస్ లో టీమిండియా ఆధిక్యం 2-1కి తగ్గింది. ఇక సిరీస్ ఫలితాన్నే నాలుగో టెస్టు తేల్చనుంది. ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి భారత్ కు ఎదురైంది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిస్తేనే టీమిండియా నేరుగా WTC ఫైనల్ కు చేరుతుంది. ఒక వేళ నాలుగో టెస్టు డ్రాగా ముగిసినా ,భారత్ ఓడినా ..న్యూజిలాండ్- శ్రీలంక జట్ల మధ్య జరిగే రెండు టెస్టుల సిరీస్ ఫలితంపై సమీకరణాలు ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే శ్రీలంక కూడా ఫైనల్ రేసులో ఉంది.
టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్..
తొలి మూడు టెస్టుల్లో రోహిత్ మినహా భారత్ టాప్ ఆర్డర్ దారుణంగా విఫలమైంది. అయితే ఈ సిరీస్ లో రోహిత్ తొలి టెస్టులో సెంచరీ చేశాడు. ఆ తర్వాత రెండు టెస్టుల్లో హాఫ్ సెంచరీ కొట్టలేదు. పూజారా తొలి రెండు టెస్టుల్లో దారుణంగా విఫలమైనా.. ముూడో టెస్టులో హాఫ్ సెంచరీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మూడు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. రాహుల్ స్థానంలో మూడో టెస్టులో జట్టులోకి వచ్చిన శుభ్ మన్ గిల్ కూడా రాణించలేకపోయాడు. సూర్య కుమార్ ఒక టెస్టు ఆడినా ఆకట్టుకోలేదు. రెండు , మూడు టెస్టుల్లో ఆడిన శ్రేయస్ అయ్యర్ ఆసీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు నానా తిప్పలు పడ్డాయి. టీమిండియా టాప్ ఆర్డర్ లో రోహిత్ ఓ సెంచరీ కొడితే.. పుజారా ఒక హాఫ్ సెంచరీ చేశాడు. కోహ్లీ, రాహుల్, అయ్యర్, సూర్య కుమార్, శుభ్ మన్ గిల్ ఒక్కరూ కూడా కనీసం హాప్ సెంచరీ చేయలేకపోయారు.
సిన్నర్లపైనే భారం..
భారత్ లోయర్ ఆర్డర్ మాత్రం బాగా రాణించింది. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ , అక్షర్ పటేల్ బ్యాట్ తోనూ మెరిశారు. బౌలింగ్ లో జడేజా , అశ్విన్ ఆసీస్ ను ముప్పు తిప్పలు పెట్టారు. అక్షర్ పెద్దగా వికెట్లు తీయకున్నా రెండు హాఫ్ సెంచరీలతో రాణించాడు.
ఆసీస్ బ్యాటర్లు భారత్ స్పిన్ బౌలింగ్ ను ఆడేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కాస్త నిలబడ్డారు. మిగతా అన్ని ఇన్నింగ్స్ ల్లో ఆస్ట్రేలియా స్కోర్ 200 మార్కు దాటలేదు. ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, స్టివ్ స్మిత్ , మార్నస్ లబుషేన్ స్నిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటూ కీలక సమయాల్లో అవుట్ కావడం ఆసీస్ ను కలవరపెడుతోంది. ఇక స్పిన్నర్లు నాథన్ లయన్ , టాడ్ మర్ఫీ, కునెమన్ అద్భుతంగా రాణిస్తున్నారు.
ఆస్ట్రేలియా ప్రధానితో కలిసి మోదీ మ్యాచ్ వీక్షణ..
నాలుగో టెస్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్తో కలిసి ఆయన మ్యాచ్ను వీక్షించబోతున్నారు. ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియం సామర్థ్యం 1,32,000. కానీ ఒక మ్యాచ్కు హాజరైన అభిమానుల లెక్కల్లో మెల్బోర్న్ స్టేడియం (1,00,024)ది ఇప్పటిదాకా రికార్డుగా ఉంది. నాలుగో టెస్టులో అహ్మదాబాద్ మైదానం కనీసం 95 శాతం నిండినా.. మెల్బోర్న్ రికార్డు బద్దలు కావడం ఖాయం.