టీ 20 ప్రపంచకప్ నకు ముందు జరిగే ఆఖరి సన్నాహక మ్యాచ్ నేడు రాత్రి 7 గంటలకు జరగనుంది. ఆఫ్గానిస్తాన్ తో బెంగళూరు వేదికగా జరగనున్న మూడో టీ 20 మ్యాచ్ కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని టీమ్ ఇండియా పట్టుదలగా ఉంది. ఈ ఒక్కటైనా గెలిచి పరువు దక్కించుకోవాలని ఆఫ్గాన్ భావిస్తోంది. అయితే రషీద్ ఖాన్ లేని లోటు, ఆ జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. మిగిలిన బౌలర్లు తేలిపోతున్నారు. ముఖ్యంగా శివమ్ దుబె వీళ్లూ వాళ్లని చూడకుండా చితక్కొట్టేస్తున్నాడు.
అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ మ్యాచ్లో ఇండియా గెలిస్తే.. అత్యధిక టీ20ల్లో జట్టును గెలిపించిన భారత కెప్టెన్గా ధోనీ రికార్డును రోహిత్ శర్మ బ్రేక్ చేస్తాడు. ధోనీ కెప్టెన్సీలో 72 మ్యాచ్ లు ఆడి, 42 విజయాలతో ముందున్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 53 మ్యాచ్ లు ఆడిన టీమ్ ఇండియా 41 విజయాలతో ఉన్నాడు. ఇప్పుడు మూడో టీ 20 గెలిస్తే ధోనీ రికార్డ్ కి సమం అవుతాడు.
ఈ మూడో టీ 20లో ముగ్గురిని మార్చే యోచనలో రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. ముఖేష్ కుమార్ ప్లేస్ లో ఆవేశ్ ఖాన్ వచ్చే అవకాశాలున్నాయి. అక్షర్ పటేల్ ఉంటాడా? వాషింగ్టన్ సుందర్ ఆడతాడా? అనేది తేలాల్సి ఉంది. అయితే రెండో టీ 20లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికైన అక్షర్ పటేల్ ని తీసే సాహసం చేయకపోవచ్చు. కాకపోతే తను ఆల్రడీ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి, అతన్ని పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ కి ఛాన్స్ ఇవ్వవచ్చు.
ఇక రవి బిష్ణోయ్ ప్లేసులో కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం ఉంది. జితేశ్ శర్మ ప్లేస్ లో సంజూ శాంసన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుందని అంటున్నారు. బౌండరీ లైను దగ్గర ఉండటంతో ఇలా కొడితే అలా ఫోర్లు వెళ్లిపోతాయి. అందువల్ల ఈ మ్యాచులో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.
తొలి రెండు మ్యాచుల్లో భారత్ మొదట బౌలింగ్ చేసింది. కానీ ఈ మ్యాచులో టాస్ కీలకంగా మారనుంది. ఎందుకంటే ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎక్కువ స్కోరు చేస్తారో వారిదే విజయం అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.