IND vs AFG T20: వరల్డ్కప్ ఫైనల్ తరువాత స్వదేశీగడ్డపై మరో సమరానికి సిద్ధమైంది భారత్. ద్వైపాక్షిక సిరీస్ అనుభవంలేని ఆప్ఘనిస్తాన్తో బరిలోకి దిగుతోంది టీమిండియా. ఇప్పటికే ఈ ఏడాది జూన్లో ప్రారంభమయ్యే పొట్టి వరల్డ్కప్పై కన్నేసిన భారత్.. అంతకు ముందు జరుగుతున్న ఈ చివరి టీ20కి కోహ్లీ లేకపోవడం.. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులతో రోహిత్ సేన కొత్తగా కనిపించనుంది. మరో వైపు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ లేకుండానే భారత్ను ఢీ కొట్టేందుకు సిద్ధమైంది అఫ్గానిస్తాన్.
దక్షిణాఫ్రికా గడ్డపై పొట్టి సిరీస్లో సమంగా నిలిచిన టీమిండియా.. స్వదేశీ గడ్డపై జరుగుతున్న ఈ మూడు మ్యాచ్ల సిరీస్ను క్లీన్స్వీప్ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది రోహిత్ సేన. ఆప్ఘాన్ తో జరగుతున్న 3 మ్యాచ్ల పోరులో భాగంగా ఇవాళ మొహాలీ వేదికగా తొలి పోరుకు సిద్ధమయ్యాయి ఇరు జట్లు.
అయితే ఈ మ్యాచ్లో కొత్తగా కనిపించనుంది టీమ్ఇండియా. టీ20 జట్టులో కచ్చితంగా ఉండే హార్దిక్ పాండ్య, సూర్యకుమార్తో పాటు.. రుతురాజ్ గైక్వాడ్ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. వీరికి తోడు ఇషాన్ కిషన్ కూడా జట్టులో లేడు. కోహ్లి కూడా తొలి మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. దీంతో మూడో స్థానంలో గిల్కు అవకాశం దక్కనుంది. మరో వైపు హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మకు కూడా ఛాన్స్ దక్కొచ్చు. 2022 టీ20 ప్రపంచకప్ సెమీస్ తర్వాత రోహిత్ తిరిగి పొట్టి ఫార్మాట్లో ఆడబోతున్నాడు. రోహిత్ నాయకత్వంలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు కుర్రాళ్లు. ప్రపంచకప్ ముందు సత్తాచాటాలనుకునే యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ మంచి అవకాశం. ఫినిషర్గా చెలరేగుతూ తన సత్తా ఏంటో చాటిన రింకూసింగ్ తొలిసారి రోహిత్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్నాడు.
వన్డే వరల్డ్ కప్లో అంచనాలకు మించి రాణించిన ఆప్ఘనిస్తాన్.. ఇప్పుడు స్పిన్నర్ రషీద్ ఖాన్ లేకుండానే టీమిండియాతో సమరానికి సిద్ధహైంది. జట్టులో రషీద్ లేకపోయినా.. వన్డే వరల్డ్కప్లో ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంకపై సంచలన విజయాలు సాధించిన ఆప్ఘనిస్తాన్.. టీ20ల్లో మరింత ప్రమాదకరంగా కనిపిస్తుంది ఇబ్రహీం సేన. ఆప్ఘనిస్తాన్ అదే ఫామ్ను.. టీ20ల్లోనూ కొనసాగిస్తే రోహిత్ సేనకు ఇబ్బందులు తప్పేలా లేదంటున్నారు విశ్లేషకులు.
గుర్భాజ్ ఇప్పటికే మెరుపు ఓపెనర్ గా గుర్తింపు తెచ్చుకోగా.. కెప్టెన్ ఇబ్రహీం మంచి ఫామ్ లో ఉన్నాడు. రహ్మత్, నజీబుల్లాతో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉండగా.. రషీద్ లోటు లేకుండా స్పిన్నర్లు ముజీబ్ రెహ్మాన్, నూర్ అహ్మద్, నబి చూసుకునేందుకు సిద్ధమయ్యారు. మరో వైపు పేసర్లు నవీనుల్ హక్, ఫారూఖీ కూడా భారత్పై ఆధిపత్యం చూపేందుకు సై అంటున్నారు.
బ్యాటింగ్ పిచ్కు అనుకూలంగా ఉన్న మొహాలీలో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. అయితే ఈ పిచ్పై మొదట్లో పేసర్లకు.. తరువాత స్పిన్నర్లకూ పరిస్థితులు సహకరిస్తాయి. అత్యంత చలి వాతావరణంలో ఆడటం ఆటగాళ్లకు సవాలే. రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఉండొచ్చు. దీంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. మొహాలీలో భారత జట్టు ఇప్పటి వరకు నాలుగు టి20 మ్యాచ్లు ఆడగా.. మూడింటిలో విజయం సాధించింది. అఫ్గానిస్తాన్తో ఐదు టి20లు ఆడగా.. ఒక మ్యాచ్ రద్దయి.. నాలుగింటిలో గెలిచింది.
.
.