IND vs AFG : ఓపెనర్ యశస్వి జైస్వాల్, శివమ్ దూబె విధ్వంసంతో ఇండోర్ లో స్టేడియం అల్లాడింది. సిక్స్ లు, ఫోర్లతో హోరెత్తిపోయింది. మొత్తానికి టీమ్ ఇండియా రెండో టీ 20 మ్యాచ్ లో గెలిచి, సిరీస్ సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్తాన్ 172 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. తర్వాత 173 పరుగుల లక్ష్యాన్ని టీమ్ ఇండియా 4 వికెట్లు కోల్పోయి కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించడం విశేషం.
టాస్ గెలిచిన భారత్.. మొదట బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో టీమ్ ఇండియా లక్ష్య ఛేదనకు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ నిరాశపరిచాడు. తొలి టీ 20లో పరుగులేమీ చేయకుండానే రన్ అవుట్ అయ్యాడు. రెండో టీ 20లో ఈసారి గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. అంటే తొలి బంతికే క్యాచ్ అవుట్ అయి పెవిలియన్ చేరాడు.
మొదటి టీ 20లో గిల్ మీద ఎగిరిన రోహిత్ శర్మ.. ఈసారి తన లోపాన్ని ఎవరు మీద నెట్టడానికి లేకుండా పోయింది. అందుకే తొందరపడి ఎవరిని నిందించకూడదని పెద్దలు చెబుతుంటారు. అది ఈసారి రోహిత్ శర్మకి బాగా అర్థమయ్యే ఉంటుంది. రోహిత్ అవుట్ అయినా మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆ బాధ్యనంతా భుజాల మీద వేసుకున్నాడు. ఫస్ట్ డౌన్ వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి బీభత్సమైన షాట్లు కొట్టాడు. కేవలం 34 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 6 సిక్స్ లు ఉన్నాయి.
ఈ క్రమంలో 29 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయాడు. అప్పుడు వచ్చాడు మొదటి టీ 20 హీరో శివమ్ దూబె. వచ్చీరాగానే సిక్స్ లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 22 బాల్స్ లోనే ఆఫ్ సెంచరీ చేశాడు. తర్వాత 32 బాల్స్ లో 63 పరుగులు చేసి, నాటౌట్ గా నిలిచాడు. ఔరా అనిపించాడు. యశస్వి జైస్వాల్, శివమ్ ఇద్దరూ కలిసి 3వ వికెట్ కి 92 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
ఈ క్రమంలో టీమ్ ఇండియా 154 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. ఈ సమయంలో తొలి టీ 20లో ఇరగ్గొట్టిన జితేశ్ శర్మ వచ్చి, కెప్టెన్ లా తను డక్ అవుట్ అయ్యాడు. అప్పుడు మళ్లీ టీమ్ ఇండియాకి ఆపద్భాందవుడిలా మారిన రింకూ సింగ్ వచ్చి, శివమ్ దూబెకి అండగా నిలిచాడు. చివరికి శివమ్ మ్యాచ్ విన్నింగ్ రన్ తీసి టీమ్ ఇండియాకి ఘన విజయాన్ని అందించాడు. అంతేకాదు సిరీస్ విజయాన్ని అందించాడు.
టీమ్ ఇండియా జట్టులో రెండో టీ20 కి, రెండు మార్పులు జరిగాయి. శుభమన్ గిల్, తిలక్ వర్మను తప్పించి, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ను తీసుకున్నారు.
ఆఫ్గాన్ బౌలర్లలో కరీం జనత్ 2, నవీన్ ఉల్ హక్ 1, ఫరూఖి 1 వికెట్లు తీసుకున్నారు.
టాస్ ఓడిన అఫ్ఘానిస్తాన్ బ్యాటింగ్ కి దిగింది. జట్టు స్కోరు 20 పరుగుల వద్ద ఓపెనర్ గా వచ్చిన రహ్మానుల్లా గుర్బాజ్ (14) వెనుతిరిగాడు. ఫస్ట్ డౌన్ వచ్చిన గులాబ్దిన్ నయిబ్.. టీమ్ ఇండియా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. కేవలం 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో 57 పరుగులు చేశాడు.
ఈ మధ్యలో మరో ఓపెనర్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (8)ని అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. తర్వాత వెంటనే సెకండ్ డౌన్ వచ్చిన అజ్మతుల్లా ఒమర్ జాయ్ (2) అయిపోయాడు. అప్పటికి ఆఫ్గాన్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 63 పరుగులతో ఉంది. గులాబ్దిన్ నయిబ్ ఉన్నంతవరకు స్కోరు బోర్డు చకచకా పరుగెట్టింది. తను 11.3 ఓవర్ లో అక్షర్ బాల్ కి క్యాచ్ అవుట్ గా వెనుతిరిగాడు.
తర్వాత మహ్మద్ నబీ (14) తక్కువ స్కోరుకే వెనుతిరిగాడు. దీంతో ఆఫ్గాన్ 104 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన నజీబుల్లా(23), కరీమ్ జన్నత్ (20), ముజీబ్ (21).. పరుగులు చేయటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. నిర్ణిత ఓవర్లలో ఆఫ్గానిస్తాన్ 172 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తర్వాత 173 పరుగుల లక్ష్యంతో దిగిన టీమ్ ఇండియా 15.4 ఓవర్లలో, 4 వికెట్ల నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్ సొంతం చేసుకుంది.
అర్షదీప్ 3, రవి బిష్ణోయ్ 2, అక్షర్ పటేల్ 2, శివమ్ దూబే ఒక వికెట్ తీశారు.