IND vs AFG 2nd T20 : నేడు టీమ్ ఇండియా – ఆప్ఘనిస్తాన్ మధ్య ఇండోర్ వేదికగా రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది. ఇప్పటికే మొదటి టీ 20 గెలిచి దూకుడు మీదున్న ఇండియా రెండో టీ 20 కూడా గెలవాలని ఆశిస్తోంది. అంతేకాదు టీమ్ ఇండియా కుర్రాళ్లు తొలి టీ20లో ఇరగదీశారు. ముఖ్యంగా ఆల్ రౌండర్ శివమ్ దూబె, వికెట్ కీపర్ జితేశ్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్ అందరూ బాగా ఆడారు.
మొదటి ఓవర్ లోనే కీలకమైన కెప్టెన్ రోహిత్ వికెట్ పడినప్పటికి కుర్రాళ్లు ఎక్కడా తొణకలేదు. బెణకలేదు. నిజానికి విరాట్ ఆడలేదు. అందువల్ల సీనియర్ ఎవరంటే రోహిత్ శర్మ ఒక్కడే అని చెప్పాలి. అలాంటివాడు సడన్ గా రన్ అవుట్ అయిపోయాడు. తర్వాత అందరూ కుర్రాళ్లే. అయినా సరే, ఎవరూ కూడా కెప్టెన్ అయిపోయాడనే ఫీలింగ్ లేకుండా చాలా ఆత్మవిశ్వాసంతో ఆడి మ్యాచ్ ని గెలపించారు.
ఆఫ్గనిస్తాన్ బౌలర్లు కూడా ఇండియా యంగ్ టీమ్ ని అవుట్ చేయలేకపోయారు. అందువల్ల రెండో టీ 20లో మనవాళ్లు అలవోకగా విజయం సాధిస్తారని, సంక్రాంతి కానుక అందిస్తారని అనుకుంటున్నారు. కాకపోతే ప్రతీది పీకలమీదకు తెచ్చుకోవడం మనవాళ్లకి ఎప్పుడూ ఆనవాయితీ, ఆ సంప్రదాయాన్ని మళ్లీ ఏమైనా కొనసాగిస్తారా? అని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే రెండో టీ 20 మ్యాచ్ లో భారత్ స్వల్ప మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. విరాట్ కొహ్లి ఈ మ్యాచ్ లో ఆడనున్నారు. కొహ్లి రావడంతో శుభమన్ గిల్ ను పక్కన పెట్టే అవకాశాలున్నాయి. ఇక యశస్వి గాయం నుంచి కోలుకుంటే ఓపెనర్ గా రోహిత్ శర్మతో దిగే అవకాశాలున్నాయి.
కుల్దీప్ యాదవ్ ను ఈ మ్యాచ్ లో ఆడించనున్నారు. రవి బిష్ణోయ్ ను పక్కన పెట్టనున్నారు. ఆప్ఘనిస్తాన్ కూడా ఈ మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను సమం చేసి ఫైనల్ మ్యాచ్ లో పోరాడాలని గట్టి పట్టుదలతో ఉంది. అందుకని ఈరోజు మ్యాచ్ రసవత్తరంగా మారే అవకాశాలున్నాయి.