Ishan Kishan, Surya : భారత్ తుది జట్టు కూర్పు ప్రతి సిరీస్ లో వివాదాలకు దారితీస్తోంది. తాజాగా శ్రీలంకపై తొలి వన్డేలో ఇషాన్ కిషన్ కు , సూర్య కుమార్ కు చోటు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెప్టెన్ రోహిత్ నిర్ణయంపై క్రికెట్ మాజీలతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
డబుల్ సెంచరీ బాదిన చోటేది?
ఇషాన్ కిషన్ తన చివరి వన్డే మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై డబుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఈ ఘనత సాధించిన నాలుగో భారత్ బ్యాటర్ గా నిలిచాడు. బంగ్లాదేశ్ వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయకుండా టీమిండియాను గెలిపించి పరువు కాపాడాడు. అలాంటి బ్యాటర్ కు తర్వాత వన్డేలో చోటే దక్కలేదు. శ్రీలంకతో తొలి వన్డేలో ఇషాన్ కు ఆడే అవకాశం కల్పించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయాన్ని మ్యాచ్ కు ఒకరోజు ముందే ప్రకటించాడు. శుభ్ మన్ గిల్ కే ఓపెనర్ గా స్థానం కల్పిస్తామని స్పష్టం చేశాడు. చెప్పినట్లుగా ఓపెనర్ గానే కాదు జట్టులో కూడా ఇషాన్ కు స్థానం కల్పించలేదు. స్పెషలిస్ట్ వికెట్ కీపర్ జట్టులో లేకున్నా కేఎల్ రాహుల్ కు ఆ బాధ్యత అప్పగించాడు. దీంతో టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెప్టెన్ రోహిత్ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు.
నంబర్ వన్ బ్యాటర్ కు స్థానం లేదా?
శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో మూడో మ్యాచ్ సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ కు శ్రీలంకతో తొలి వన్డేలో తుది జట్టులో చోటు దక్కలేదు. ప్రస్తుతం సూర్య సూపర్ ఫామ్ లో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో ఒక సెంచరీ, ఒక అర్థసెంచరీ చేశాడు. సూర్య టీ20 ఫార్మేట్ లో వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్. ప్రస్తుతం భీకర ఫామ్ లో ఉన్న సూర్యను బెంచ్ కే పరిమితం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కెప్టెన్ రోహిత్ నిర్ణయంపై టీమ్ఇండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వరుస ట్వీట్లతో విమర్శలు కురిపించాడు. ఇటీవలే వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్కు అవకాశం ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నాడు.
వెంకటేశ్ ప్రసాద్ ఏమన్నాడంటే..?
‘‘డబుల్ సెంచరీ బాదిన ఆటగాడికి వన్డేల్లో చోటు లేకపోవడంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇదంతా గిల్ కోసం చేస్తున్నట్లుగానే ఉంది. కానీ డబుల్ సెంచరీ సాధించిన ఆడిగాడిని పక్కన పెట్టడం సరైంది కాదు. ఒకవేళ గిల్ను తీసుకోవాలంటే మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపాలి. కేఎల్ రాహుల్ బదులు ఇషాన్ను తీసుకొని ఓపెనర్గా ఆడించొచ్చు. గతంలో ఇంగ్లాండ్ పై రిషభ్ పంత్ సెంచరీతో భారత్ను గెలిపించాడు. అయితే తర్వాత టీ20 ల్లో ఫామ్ను కారణంగా చూపి వన్డే జట్టులోకి తీసుకోవడం లేదు. మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం గత కొన్ని ఇన్నింగ్స్ల్లో దారుణంగా విఫలమయ్యాడు. అయినా అతడు తన స్థానాన్ని నిలబెట్టుకోగలగుతున్నాడు. ఇక్కడ ప్రదర్శన ప్రామాణికం కావడం లేదు’’ అని వెంకటేశ్ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
మళ్లీ మళ్లీ అవే తప్పులు
ఇలాంటి తప్పిదాలు రెండు సిరీస్ ల వ్యవధిలో 3సార్లు చోటుచేసుకున్నాయి. బంగ్లాదేశ్ పై తొలి టెస్టులో 8 వికెట్లు పడగొట్టడమేకాకుండా బ్యాట్ తో రాణించి కులదీప్ యాదవ్ ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. అయితే ఆ తర్వాత టెస్టులో కులదీప్ ను పక్కన పెట్టారు. అప్పుడు కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ పై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినా సరే తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.
విఫలవీరులకే చోటు
విఫలమవుతున్న ఆటగాళ్లకు పదేపదే అవకాశాలు కల్పిస్తూ.. మెరుగైన ప్రదర్శన చేస్తున్న ఫ్లేయర్లను పక్కనపెట్టడం భారత్ క్రికెట్ కు ఏమాత్రం మంచిదికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తరచూ ఫెయిల్ అవుతున్న కేఎల్ రాహుల్ లాంటి ఫ్లేయర్ల కోసం సూపర్ ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ , సూర్యకుమార్ యాదవ్ లాంటి ఆటగాళ్లను పక్కనపెట్టడం సరైన నిర్ణయం కాదని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు.