Virat Kohli : భారత దేశ క్రికెట్ లోనే కాదు, ప్రపంచ క్రికెట్ లో ఎన్నో రికార్డులను సచిన్ టెండుల్కర్ నెలకొల్పాడు. సచిన్ రిటైర్ అయి 10 ఏళ్లు దాటింది. ఇప్పటి వరకు తను స్థాపించిన చాలా రికార్డులను విరాట్ కోహ్లీ నెమ్మదిగా సమం చేస్తూ, కొన్నింటిని దాటుకుంటూ వెళుతున్నాడు. వాటిలో మరొకటి కోహ్లీ ముందుంది.
ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ ల్లో సచిన్ టెండుల్కర్ 53 ఇన్నింగ్సుల్లో 2535 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ రికార్డుపై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కన్నేశాడు. తనిప్పటి వరకు ఇంగ్లాండ్ పై 50 ఇన్నింగ్సు ఆడి, 1991 పరుగులు చేశాడు. జనవరి 25 నుంచి జరగనున్న ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్లో కోహ్లీ మరో 545 రన్స్ చేస్తే చాలు.. సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది.
ఐదు టెస్టుల్లో మొత్తం 10 ఇన్నింగ్స్ లో తను ఉన్న ఫామ్ కి అది సాధ్యమేనని అంటున్నారు. అలాగే సెంచరీల సంఖ్య కూడా పెంచుకోవాలని అభిమానులు కోరుతున్నారు. ఇప్పటికి టెస్టుల్లో 29, వన్డేల్లో 50, టీ 20లో 1 సెంచరీ మొత్తం 80 ఉన్నాయి. ఈ టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఎన్ని ఎక్కువ సెంచరీలు చేయగలిగితే అంత మంచిదని అంటున్నారు.
ఇంగ్లాండ్ కీలక ప్లేయర్ జో రూట్ ఇప్పటివరకు ఇండియాపై 9 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అలిస్టర్ కుక్లు ఏడేసి సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. కోహ్లీ 5 సెంచరీలు మాత్రమే చేశాడు.
సచిన్ రికార్డ్ కి కేవలం 10 పరుగుల దూరంలో జో రూట్ ఉన్నాడు. తను కూడా ఇండియా అంటే చాలు, బ్రహ్మాండంగా ఆడతాడు. ఇండియాపై తనకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. కానీ సచిన్ కోరిక ఏమిటంటే, తన రికార్డులను ఒక ఇండియన్ బ్రేక్ చేయాలి. అప్పుడే సంతోషమని తెలిపాడు. మరి క్రికెట్ గురువుగా పేర్కొనే సచిన్ మాటను కోహ్లీ నిలబెడతాడా? లేదా చూడాల్సిందే.