Mohammed Shami : వన్డే వరల్డ్ కప్ 2023లో మహ్మద్ షమీ అద్భుత పెర్ ఫార్మెన్స్ తో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఇండియా ఫైనల్ వరకు వెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించిన ముగ్గురు, నలుగురిలో తను కూడా ఒకడిగా ఉన్నాడు. దీంతో షమీపై పాకిస్తాన్ ఆటగాళ్ల దగ్గర నుంచి దురభిమానులు కూడా ట్రోలింగ్ మొదలుపెట్టారు. అతను అన్ని వికెట్లు తీయడాన్ని వాళ్లు తట్టుకోలేక పోయారు. ఇది గమనించిన షమీకి కూడా విసుగొచ్చింది. ఒక దశలో తనపై ఆరోపణలు చేసిన ఆటగాళ్లకు తగిన రీతిలో బదులిచ్చాడు. దీంతో మరో అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చి ఆనందిస్తున్నారు.
విషయం ఏమిటంటే వరల్డ్ కప్ లో ఐదు వికెట్లు తీసిన సమయంలో మైదానంలో మోకాళ్లపై కూర్చుని షమీ ఆనందం వ్యక్తం చేశాడు. దానిని పాక్ చెందిన కొంతమంది వక్రీకరిస్తూ ట్వీట్లు చేశారు. షమీ ప్రార్థన చేయాలని అనుకున్నాడని, అయితే భారత్ లో భయపడ్డాడని పోస్టులు పెట్టారు. ఈ విషయమై ఒక ఇంటర్వ్యూలో షమీ ఆవేదన వ్యక్తం చేశాడు.
గతంలో కూడా నేను ఐదు వికెట్లు తీసిన సందర్భాలున్నాయి. అప్పుడు నేను ప్రార్థనలు చేశానా? అని ప్రశ్నించాడు. అప్పుడు లేనిది, ఇప్పుడెందుకు చేస్తానని అన్నాడు. నేను 100 శాతం కన్నా 200 శాతం ఎక్కువగా పెర్ ఫార్మ్ చేశాను. అందువల్ల 5 వికెట్లు తీసిన సమయంలో ఎక్కువ కష్టపడటం వల్ల, ఒక అలసటతో కూడిన ఆనందంతో, మోకాళ్లపై కూలబడ్డానని తెలిపాడు. అంతేగానీ నేను ప్రార్థనలు చేయలేదని స్పష్టం చేశాడు.
నేను ఒక భారతీయుడిగా గర్వపడతాను. భారతీయ ముస్లింని అని సగర్వంగా చెప్పుకుంటానని అన్నాడు. అలాంటప్పుడు నేను ప్రార్థనలు చేస్తే ఎవరు ఆపుతారు? అని సూటిగా ప్రశ్నించాడు. నేను చేయానుకుంటే చేస్తాను. అందులో తప్పేం ఉంది? అని అన్నాడు. కానీ కొంతమందికి ఒక కంటెంట్ కావాలి..అందుకోసం నన్ను వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
నిజంగా ఫైనల్ మ్యాచ్ లో ఓటమి తర్వాత ఎవరికీ భోజనం కూడా సహించలేదని చెప్పాడు. అందరం నిస్సత్తువగా ఉండిపోయాం. రెండు నెలల నుంచి పడిన శ్రమంతా ఒక్క రోజులో పోయిందని అన్నాడు. అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి, మాలో నూతనోత్సాహాన్ని రేపారు. నిజంగా ఆయనే గానీ రాకపోయి ఉంటే, ఆ ధైర్యం, భరోసా ఇచ్చి ఉండకపోతే ఇప్పుడిప్పుడే కోలుకొని ఉండేవాళ్లం కాదని అన్నాడు. మోదీ వెళ్లిన తర్వాతే మేం ఒకరినొకరం మాట్లాడుకున్నామని చెప్పుకొచ్చాడు.