ICC WC 2023 Points Table: అప్పుడే జనంలో వరల్డ్ కప్ ఫీవర్ వచ్చేసింది. మనవాళ్లు అద్భుతంగా ఆడటంతో అందరిలో ఆసక్తి పెరిగింది. ఇప్పటికి మెగా టోర్నమెంటు సగం దూరం వచ్చేసింది. దీంతో పాయింట్ల టేబుల్ లో ఎవరు టాప్ ఫోర్ లో ఉన్నారు? ఎవరు 5, 6 స్థానాల్లో ఉన్నారనేది ఒక పిక్చర్ వచ్చేసింది. ఎవరు అడుగు నుంచి నాలుగు స్థానాల్లో ఉన్నారని కూడా ఒక అంచనాకి వస్తున్నారు.
ఇప్పుడిప్పుడే క్రికెట్ పై ఎవరికి వారు ప్రజల్లో ఆసక్తిని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకు ముంబయి క్రికెట్ సంఘం ఏం చేసిందంటే ఒక ఆసక్తికరమైన ప్రయత్నం చేసింది. 2011 ఫైనల్ లో ధోని కొట్టిన విన్నింగ్ సిక్సర్ ని ఎవరూ మరిచిపోలేరు. ఆరోజున వాంఖేడి స్టేడియంలో ధోని కొట్టిన బాల్ వెళ్లి ఓ రెండు కుర్చీలపై పడింది. వాటికి రంగులేశారు. అందరి దృష్టి అక్కడ పడేలా చేశారు. అంతేకాదు దీనికి ‘ప్రపంచకప్ 2011 విజయ స్మారక స్టాండ్’ అని నామకరణం కూడా చేశారు.
ఇంగ్లండ్ -దక్షిణాఫ్రికా మ్యాచ్ సందర్భంగా అందరి ద్రష్టి ఆ కుర్చీలపై పడింది. అప్పుడందరూ ఏమిటి? ఏమిటి? అని ఆసక్తిగా నెట్టింట వెతికితే ఇదంత ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ ) ఉత్సాహం అని తెలిసింది.
ఇకపోతే ఓడలు బళ్లవుతాయి. బళ్లు ఓడలవుతాయి అంటారు. అలాగ 2019లో డిఫెండెంగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఈసారి బొక్కబోర్లా పడింది. పసికూన ఆఫ్గనిస్తాన్ చేతిలో పరాజయం అందుకోవడమే కాదు…దక్షిణాఫ్రికాపై ఘోరాతి ఘోరంగా ఓటమి పాలైంది. దీంతో ముప్పేట ఇంగ్లండ్ పై దాడి జరుగుతోంది. స్వదేశంలో అయితే క్రికెట్ కు పుట్టిల్లు అయిన ఇంగ్లండ్ పరువు తీశారంటూ ఏకిపారేస్తున్నారు.
ఏ ముఖం పెట్టుకువెళ్లాలని అప్పుడే క్రీడాకారుల్లో వణుకు మొదలైంది. కాకపోతే ఇక ఆడాల్సిన 5 మ్యాచ్ ల్లో ఆడి పరువు నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాయి. అయితే వరుసగా నాలుగు గెలిచామని సంబరపడాల్సిన అవసరం లేదని పలువురు ఇండియాని హెచ్చరిస్తున్నారు. ఇంకా వెనుక ఆడాల్సిన మ్యాచ్ లు 5 ఉన్నాయి కాబట్టి, ఎప్పుడేమవుతుందో ఎవరూ చెప్పలేరని అంటున్నారు.
ఆస్ట్రేలియా రేస్ లోకి వచ్చింది. పాకిస్తాన్ కసి మీద ఉంది. శ్రీలంకని తక్కువగా అంచనా వేయలేం. ఒక్కసారి గెలుపు రుచి చూస్తే వారు ఆగరనే పేరుంది. ఇప్పటికి ఒక ట్రాక్ ఎక్కేవరకే ఇలా ఉంటుంది. ఒకసారి ఎక్కారా? ఎవరిని లెక్క చేయరని అంటున్నారు.