ICC Rates Cape Town Pitch : ఇన్నాళ్లూ విదేశీ మీడియా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కూసిన అవాకులు, చవాకులు గాలికి కొట్టుకుపోయాయి. ఐసీసీ చాలా సీరియస్ గా ఉందని, రోహిత్ శర్మ చిక్కుల్లో ఉన్నాడని గాలి వార్తలన్నీ గుమ్మరించింది. ఎప్పటిలా భారతదేశంపై తన విషాన్ని వెళ్లగక్కింది.
కానీ ఐసీసీ మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మకే పరోక్షంగా తమ మద్దతు తెలిపింది. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్ టౌన్ లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ పిచ్ పై ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. మ్యాచ్ రిఫరీ క్రిస్ బాడ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇది ఒక చెత్త పిచ్ అని చెబుతూనే, అసంత్రప్తికరం అని పేర్కొంది. ఇంకా కోపం తగ్గక ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది.
మ్యాచ్ జరుగుతున్నంత సేపు పిచ్ చాలా భయంకరంగా స్పందించిందని మ్యాచ్ రిఫరీ తన నివేదికలో పేర్కొన్నారు. బ్యాటర్లు చాలామంది గ్లౌస్ కి బాల్ తగిలి దెబ్బలు కూడా తగిలాయని అన్నారు. ఇలాంటి పిచ్ లపై ఆడి, గాయాల పాలైతే, ఆటగాళ్ల కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోయే ప్రమాదం ఉందని అన్నాడు. పిచ్ పై బాల్ అనూహ్యంగా బౌన్స్ అయిందని, అందుకే త్వరగా వికెట్లు పడ్డాయని తెలిపాడు.
ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టసాధ్యంగా మారింది. బాల్ కొన్ని సార్లు ప్రమాదకరంగా స్పందించిందని తెలిపాడు. అందుకనే ఐసీసీ కూడా సీరియస్ గా స్పందించింది. ఐసీసీ ప్రమాణాలకు తగిన స్థాయిలో పిచ్ లేకపోవడంతో కేప్ టౌన్ గ్రౌండ్ కి ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది. ఒక ఏడాదిలో ఆరు డి మెరిట్ పాయింట్ల గానీ వస్తే ఆ స్టేడియంపై ఏడాది నిషేధం విధిస్తారు. అదే12 పాయింట్లకు చేరితే రెండేళ్ల నిషేధం ఉంటుంది.
అయితే వ్యవహారం అంత దూరం వెళ్లదు. ఆ స్టేడియంలో కొన్నాళ్లు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడకుండా చూస్తారు. తర్వాత మళ్లీ యథాతథంగానే ఉంటాయని అంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా మనవాళ్లే కాదు, ఏ దేశపు ఆటగాళ్లు వెళ్లినా సరే, అక్కడి పిచ్ లు అలాగే ఉంటాయని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.