Virat Kohli : ఐసీసీ టెస్ట్ క్రికెట్ ర్యాంకింగులను విడుదల చేసింది. రెండేళ్ల నుంచి టాప్ టెన్ లో స్థానం కోల్పోయిన విరాట్ కోహ్లీ మళ్లీ తిరిగి వచ్చేశాడు. 2022లో టాప్-10లో నిలిచిన కోహ్లీ.. తాజా ర్యాంకుల్లో 9వ స్థానానికి చేరుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలిటెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 38 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 76 పరుగులు చేసిన కోహ్లీ నాలుగు స్థానాలను మెరుగు పరుచుకున్నాడు.
ఇప్పటివరకు 13వ స్థానంలో ఉన్న కోహ్లీ .. తొమ్మిదో ర్యాంక్ కి వచ్చాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులు చేశాడు. అలాగే రెండో ఇన్నింగ్స్ లో మరిన్ని చేసి, అలాగే రేపు భారత్ లో ఇంగ్లాండ్ తో జరిగే 5 టెస్టు మ్యాచ్ లు, 10 ఇన్నింగ్స్ ల్లో కొన్ని సెంచరీలు కొడితే నెంబర్ వన్ స్థానానికి వచ్చేస్తాడని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.
ఎందుకంటే జరిగేది భారత్ లో కాబట్టి, సొంత గడ్డపై మనవాళ్లు పులులు కాబట్టి, ఇరగదీసి ఆడేస్తారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక గొప్ప విషయం ఏమిటంటే.. టాప్-10లో ఉన్న ఏకైక భారత బ్యాటర్ విరాట్ కోహ్లీనే కావడం విశేషం. తొలి టెస్ట్లో విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ 10 నుంచి 14వ ర్యాంక్ కి పడిపోయాడు. ఏడాదిగా జట్టుకి దూరంగా ఉన్న రిషబ్ పంత్ 15వ స్థానంలో ఉన్నాడు. అలాగే తొలిటెస్టులో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ 11 స్థానాలు మెరుగుపరుచుకుని 51వ ర్యాంక్లో నిలిచాడు.
టెస్ట్ ల్లో అవకాశాలు అంతంత మాత్రంగా వస్తున్నా సరే, రవిచంద్రన్ అశ్విన్(872 పాయింట్స్) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సౌతాఫ్రికా బౌలర్ కగిసో రబడా రెండో స్థానంలో ఉన్నాడు.ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ మూడో స్థానంలో ఉండగా, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా, అశ్విన్ టాప్-2లో ఉండటం విశేషం.
సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్ట్ లో కూడా వికెట్లు టపటపా పడిపోయాయి. అలాగే బ్యాటర్ల వైఫల్యం ఇవన్నీ కూడా ర్యాంకులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని అంటున్నారు.