ఐసీసీ తాజాగా నవంబర్ నెలకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ట్రావిస్ హెడ్ కు ప్రకటించింది. చివరి వరకు రేస్ లో నిలిచిన టీమ్ ఇండియా బౌలింగ్ సంచలనం మహ్మద్ షమీకి రాకపోవడంతో భారత్ లో క్రికెట్ అభిమానులు ఉసూరుమన్నారు. అసలు ట్రావిస్ హెడ్, మ్యాక్స్ వెల్ తో పాటు షమీ ఈ అవార్డుకి నామినేట్ అయ్యారు.
అయితే వన్డే వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీ సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లో హెడ్ రాణించాడు. ఫైనల్ లో 120 బంతుల్లో 137 పరుగులు చేసి ఒంటి చేత్తో కప్ తీసుకొచ్చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన సెమీస్ లో 48 బంతుల్లో 62 పరుగులు చేసి, రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. బహుశా అందుకే ట్రావిస్ హెడ్ కే ఓట్లు పడ్డాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
వన్డే వరల్డ్ కప్ 2023లో అద్భుతమైన మ్యాచ్ ఏదంటే… అఫ్గానిస్థాన్ వర్సెస్ ఆసిస్ అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ సంచలన ప్రదర్శన నభూతో నభవిష్యత్ అని చెప్పాలి. 91 పరుగులకే ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయి, ఓటమి అంచువరకు వెళ్లిన జట్టుని డబుల్ సెంచరీ చేసి, నాటౌట్ గా నిలిచి ఒంటి చేత్తో గెలిపించడం సామాన్యమైన విషయం కాదు.
ఆ జట్టు 292 పరుగుల టార్గెట్ ను ఒకే ఒక్కడు ఛేదించడమంటే మాటలు కాదు. అంతేకాక వరల్డ్ కప్ అనంతరం టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్ లో కూడా మాక్స్ వెల్ విధ్వంసం కొనసాగింది. అక్కడ కూడా 48 బంతుల్లో 104 పరుగులు చేసి ఆసీస్ ను మూడో టీ20లో గెలిపించాడు.
ఇక మహ్మద్ షమీ నాలుగు మ్యాచ్ లు లేట్ గా వరల్డ్ కప్ లో అడుగుపెట్టినా లేటెస్ట్ పెర్ ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. అదే మొదటి నుంచి ఆడి ఉంటే, కనీసం 40 వికెట్లయినా తీసేవాడని అంటున్నారు. అన్ని మ్యాచ్ ల్లో అద్భుత ప్రదర్శన చేసి కివీస్ తో జరిగిన సెమీఫైనల్ లో ఏకంగా 7 వికెట్లు తీసి ఆ జట్టు నడ్డి విరిచాడు. అదే బౌలింగ్ ప్రదర్శన ఫైనల్ లో చేయలేకపోయాడు.
ఓవరాల్ గా 24 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. కాకపోతే ఫైనల్ లో వికెట్లు తీసి, మ్యాచ్ ని గెలిపించి ఉంటే, బహుశా తనకే వచ్చేదేమో అవార్డు అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అదే జరిగితే, ట్రావిస్ హెడ్ ప్లేస్ లో విరాట్ కొహ్లీ వచ్చి చేరేవాడని కూడా అంటున్నారు. ఆ ఒక్క మ్యాచ్ తో ఆటగాళ్ల తలరాతలు కూడా మారిపోయాయని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.