ICC Negligence:టెస్ట్, వన్డే, టీ-20… ఈ మూడు ఫార్మాట్లలోనూ భారత క్రికెట్ జట్టు నెంబర్వన్ పొజిషన్లో నిలిచిందనే వార్త… బుధవారం టీమిండియా అభిమానుల్ని సంతోషంలో ముంచెత్తింది. కానీ, వారి ఆనందం నాలుగు గంటల సేపు మాత్రమే ఉంది. కారణం… ఐసీసీ చేసిన పొరపాటు. సాంకేతిక తప్పిదం, ఐసీసీ అత్యుత్సాహం… ఈ రెండూ ర్యాంకింగ్స్కు మచ్చగా మారాయి.
బంగ్లాదేశ్పై టెస్ట్ సిరీస్ విజయం తర్వాత టీమిండియా టెస్ట్ ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియాతో సిరీస్ మొదలవడానికి ముందు డబ్ల్యుటీసీ పాయింట్ల పట్టికలో 58.93 శాతంతో భారత్ రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాపై 3 టెస్టుల సిరీస్ను 2-0 తేడాతో గెలుచుకున్న ఆస్ట్రేలియా… డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 75.56 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతూ… భారత పర్యటనకు వచ్చింది. దాంతో, టెస్టుల్లో టీమిండియా నెంబర్వన్ కావాలంటే… ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్ నెగ్గాల్సి ఉంటుందని లెక్కలేశారు. కానీ… తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ గెలవగానే… టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుందని ఐసీసీ వెబ్సైట్లో పెట్టడంతో… ఎలా అయిందా? అని అభిమానులు అనుకున్నారు. ఐసీసీ తప్పు చెప్పదుగా అని… మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా నెంబర్వన్ అయినందుకు సంబరాలు చేసుకున్నారు. కానీ… 4 గంటల తర్వాత… సాంకేతిక తప్పిదం వల్లే టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా నెంబర్వన్ అయిందని ఐసీసీ తీరిగ్గా ప్రకటించింది. దాంతో… అత్యంత ప్రతిష్టాత్మకమైన ర్యాంకింగ్స్ ప్రకటించే ముందు కనీస జాగ్రత్తలు తీసుకోరా? అని అభిమానులు ఐసీసీకి చురకలంటించారు.
ప్రస్తుతం టెస్ట్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా, ఇండియా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే కంగారూలపై తొలి టెస్టు గెలిచిన రోహిత్ సేన… రెండో టెస్టులోనూ విజయం సాధిస్తే… టెస్టుల్లో నెంబర్వన్ పొజిషన్కు చేరుకుంటుంది. టీమిండియా జోరు చూస్తుంటే… రెండో టెస్టులోనే కాదు, చివరి రెండు టెస్టుల్లోనూ గెలిచి టెస్ట్ ర్యాంకింగ్స్తో పాటు వన్డే, టీ-20 ర్యాంకింగ్స్లోనూ నెంబర్వన్ పొజిషన్కు చేరుకున్న జట్టుగా అవతరిస్తుందని అభిమానులు అంటున్నారు.