Mary Kom : భారత బాక్సింగ్ దిగ్గజం, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్.. ఓ స్కూల్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. దీనిపై మేరీకోమ్ స్పందించి.. వీడ్కోలు వార్తలను కొట్టిపారేశారు. తాను ఇప్పుడే బాక్సింగ్ను వీడబోనని స్పష్టం చేశారు.
అస్సాంలో జరిగిన ఓ స్కూల్ ఈవెంట్లో మేరీకోమ్ పాల్గొన్నారు. ఆటల్లో ఇంకా ఏదో సాధించాలనే తపనతో ఉన్నా. తన వయసు అడ్డంకిగా మారిందన్నారు. వయోపరిమితి కారణంగా.. ఒలింపిక్స్, ఇతర పోటీల్లో పాల్గొనలేకపోతున్నట్లు చెప్పారు. తనకు ఇంకా ఆడాలని ఉన్నా బలవంతంగా వైదొలగాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. తన జీవితంలో అన్నీ సాధించానని.. నిజానికి ఇక రిటైర్ అవ్వాలని అన్నారు.
దీంతో ఆమె బాక్సింగ్కు వీడ్కోలు పలుకుతున్నట్లు వార్తలు వెల్లువెత్తాయి. వాటిని మేరీకోమ్ ఖండించారు.తాను ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా, మీడియాలో కథనాలు వస్తున్నాయని.. అవన్నీ నిజం కాదన్నారు. తాను ఇంకా వీడ్కోలు పలకలేదని.. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టత ఇచ్చారు.
మేరీకోమ్.. కెరీర్లో ఎన్నో మరుపురాని విజయాలు సాధించారు. 2012 ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన మేరీ.. అప్పటి వరకు మహిళా బాక్సింగ్లో భారత్ తరఫున ఎవరూ సాధించని రికార్డును నెలకొల్పింది. మహిళా బాక్సర్లలో మరెవరికీ సాధ్యం కాని రీతిలో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచారు. ఐదుసార్లు ఆసియా ఛాంపియన్ అయ్యారు. తన 18 ఏళ్ల వయసులో పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్లో జరిగిన బాక్సింగ్ పోటీల్లో అంతర్జాతీయ ప్రవేశం చేసిన ఈ మణిపుర్ స్టార్.. 48 కేజీల విభాగంలో తొలిసారి ఫైనల్ చేరి చివరిమెట్టుపై బోల్తా పడింది. అనంతరం జరిగిన ఏఐబీఏ ఉమెన్స్ ప్రపంచ ఛాంపియన్లో విజేతగా నిలిచి భారత్ తరఫున బాక్సింగ్లో తొలిసారి బంగారు పతకం సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోని మేరీ.. 2005, 2006, 2008, 2010లో వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో విజేతగా నిలిచింది.
అనంతరం తన ఇద్దరు పిల్లల కోసం ఆటకు కాస్త విరామం ఇచ్చిన ఆమె.. 2012 ఒలింపిక్స్లో కాంస్య పతకంతో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. 2018లో దిల్లీలో జరిగిన ప్రపంచ ఛాంపియన్ పోటీల్లో మరోసారి విజేతగా నిలిచింది. అంతర్జాతీయ పోటీల్లో అద్భత ప్రదర్శనతో దేశానికి చిరస్మరణీయ విజయాలు సాధించిపెట్టిన మేరీకోమ్ గత కొద్ది రోజులుగా ఆటకు దూరంగా ఉన్నారు. 2022లో కామన్వెల్త్ క్రీడల సెలక్షన్ ట్రయల్ సందర్భంగా మోకాలికి గాయం కావడంతో అప్పటి నుంచి ఆమె రింగ్లోకి దిగలేదు.