Hardik Pandya: వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచ్ లు ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నో రికార్డులు బద్దలవుతున్నాయి. అలాగే ఎన్నో దెబ్బలు కూడా తగులుతున్నాయి. పుణెలో జరిగిన ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటికే బంగ్లా ఓపెనర్లు ఎడా పెడా వాయించేస్తున్నారు. వికెట్లు పడటం లేదు. అంతా అసహనంగా ఉన్నారు. ఈ సమయంలో మ్యాచ్ 9వ ఓవర్ లో పాండ్యా చేతికి కెప్టెన్ బాల్ ఇచ్చాడు. అప్పటికి పాండ్యా మూడు బాల్స్ వేశాడు. మొదటి రెండు బాల్స్ కి రెండు ఫోర్లు వెళ్లాయి. అయితే మూడో బాల్ కూడా లిటన్ దాస్ స్ట్రయిట్ డ్రైవ్ ఆడాడు. ఇక దానిని తప్పనిసరిగా ఆపాలని పాండ్యా కాలితో ఆపే ప్రయత్నం చేశాడు. అదే కొంప ముంచింది.
ఆ బాల్ వెళ్లి కాలి చీలమండకు తగలడంతో పాండ్యా గ్రౌండ్ లో విలవిల్లాడాడు. కుంటుకుంటూనే మైదానం వీడాడు. ప్రస్తుతం పాండ్యా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. గాయం పెద్దది కాదని చెబుతున్నారు. అయితే రెస్ట్ లో ఉండటమే మంచిదని సలహా ఇస్తున్నారు. దీంతో న్యూజిలాండ్ తో ధర్మశాలలో అక్టోబర్ 22న జరిగే మ్యాచ్ లో హార్ధిక్ ఆడటం లేదని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. తను నేరుగా అక్టోబర్ 29న ఇంగ్లాండ్ తో పోరుక్ లఖ్ నవ్ చేరుకుంటాడని పేర్కొంది.
ఇప్పుడు ఇండియాకి పెద్ద చిక్కే వచ్చి పడింది. ఎందుకంటే బ్రహ్మాండమైన వరుస విజయాలతో దూసుకువెళుతున్న జట్టుకి పాండ్యా గాయం ఆశనిపాతమే అంటున్నారు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా లాంటి ఆల్ రౌండర్ ఇప్పుడు రిజర్వ్ బెంచ్ లో లేరు. తనని రీప్లేస్ చేసే ప్లేయర్లు కూడా ఐపీఎల్ లో వెతికినా కనిపించడం లేదు. తను జట్టులో ఉంటే ఒక ఇన్సిపిరేషన్ ఉంటుందని అంటున్నారు. అతను జట్టుకోసం ఆడే తీరే ఎంతో స్ఫూర్తిమంతంగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు ఐదో బౌలర్ గా కూడా సేవలందిస్తున్నాడు. శార్దూల్ ధారాళంగా పరుగులు ఇవ్వడంతో ఆ భారాన్ని తను మోస్తున్నాడు. ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. అదీకాక తనిప్పుడు జట్టుకి వైస్ కెప్టెన్ గా కూడా ఉన్నాడు.
ఇటీవలే వెన్నునొప్పికి శస్త్రచికిత్స చేసుకుని ఇప్పుడిప్పుడే పాండ్యా గాడిలో పడుతున్నాడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడి జట్టుని గెలిపించిన తీరుతో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చాడు. అదే ఉద్దేశంతో బోర్డు ఇండియన్ జట్టుకి వైస్ కెప్టెన్ ని చేసింది. మ్యాచ్ లో అతని సలహాలు, సూచనలు జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని అంటున్నారు.