Hardik Pandya : ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ పై రకరకాల కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ టైమ్ లో హార్ధిక్ పాండ్యా ఉంటే ఎంత బాగుండేదని అనుకుంటున్నారు. ఒకవైపు పిచ్ బ్యాటింగ్ కి అనువుగా లేదు. బాల్ బాల్ కి కఠినంగా మారిపోతోంది. బ్యాటర్లు సింగిల్స్ తీయడానికి కూడా కష్టపడుతున్నారు.
సముద్రమంతా ఈదిన గజ ఈతగాడు చిన్న గోతిలో పడి డెబ్బలు తగిలించుకున్నట్టు, టీమ్ ఇండియా అన్నింటా విజయ పతాకాన్ని ఎగురవేసి, చివరి మెట్టు దగ్గర పల్టీ కొట్టింది. ఈ నేపథ్యంలో అందరికీ హార్దిక్ పాండ్యా గుర్తొస్తున్నాడు. నిజానికి తనే గానీ ఉండి ఉంటే…
వికెట్లు పడుతున్నప్పుడు రవీంద్ర జడేజా బదులు హార్దిక్ వచ్చేవాడు. కాసేపు వికెట్ల పతనాన్ని నిలువరించేవాడని అంటున్నారు. అంతేకాదు బౌలింగ్ లో కూడా ఐదుగురి బౌలర్లు ప్రభావం చూపించలేకపోతున్న సమయంలో హార్దిక్ వైపు రోహిత్ చూసేవాడని అంటున్నారు. రెండు విధాల ఆదుకునే హార్దిక్ ఆ సమయంలో లేకపోవడం ఇప్పుడు తెలిసొచ్చిందని అంటున్నారు.
తీవ్ర గాయంతో వెనుతిరిగిన హార్దిక్ మళ్లీ వన్డే వరల్డ్ కప్ గేమ్ లో కనిపించలేదు. అయితే తన ప్లేస్ లో వచ్చిన షమీ బౌలింగ్ విభాగంలో ఆ లోటు లేకుండా చేశాడు. కానీ బ్యాటింగ్ లోకి వచ్చిన సూర్యకుమార్ మాత్రం తేలిపోయాడు. అయితే తనకి కూడా అవకాశాలు రాలేదు. వచ్చిన ఫైనల్ మ్యాచ్ లో చేతులెత్తేశాడు.
శార్దూల్ ఠాకూర్ ప్లేస్ లో వచ్చిన షమీ తన బాధ్యతలను నూటికి నూరుశాతం అందించాడు. అంతవరకు ఓకే కానీ, సూర్య ఫైనల్ మ్యాచ్ చివర్లో టీ 20 స్లయిల్ లో ఆడి ఉంటే, మరో 30, 40 పరుగులు వచ్చేవి. అప్పుడు ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెరిగేది. అన్ని బాల్స్ డిఫెన్స్ ఆడేవారు కాదని అంటున్నారు. ఏదొకటి రిస్క్ తీసుకునేవారని చెబుతున్నారు.
ఇక హార్దిక్ పాండ్యాకు మరోక దెబ్బ ఏమిటంటే ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్ కి కెప్టెన్ గా ఉండాల్సిన వాడు, ఆ ఛాన్స్ కూడా పోయింది. కాలుకి ఆపరేషన్ చేయాల్సి వస్తుందని కూడా అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మరో ఆరునెలల్లో ప్రారంభమయ్యే టీ 20 వరల్డ్ కప్ కైనా రెడీ అవుతాడా ? లేదా? అనేది వేచి చూడాల్సిందే.