Hardik Pandya : ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి సంబంధించి అప్పుడే సందడి మొదలైంది. ఎందుకంటే ఏ క్రికెటర్లు వస్తున్నారు? ఎవరు వెళుతున్నారనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా విషయంలో ఏం జరగబోతోంది. ఫ్రాంచైజీలు ఆటగాళ్లను మార్చుకుంటారా? జట్టులో ఇన్ బ్యాలెన్స్ ను సరిచేసుకుంటారా? అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
హార్దిక్ పాండ్యా ఏడేళ్లు ముంబయి జట్టు తరఫున ఆడాడు. వాళ్లు సడన్ గా మాకొద్దన్నారు. గుజరాత్ టైటాన్స్ వాళ్లు తీసుకుని కెప్టెన్ చేశారు. దాంతో హార్దిక్ ఏకంగా కప్ తీసుకొచ్చేశాడు. ఇప్పుడు హార్దిక్ లేని లోటు ముంబయిలో స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్లకి సమర్థుడైన ఒక ఆల్ రౌండర్ కావాలి. అంతేకాదు హార్దిక్ పాండ్యా భావి భారత టీమ్ ఇండియా కెప్టెన్ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మకి వయసైపోతోంది. ప్రాక్టికాలిటీ బోధపడేసరికి చేతిలో ఉన్న వజ్రం చేజారిపోయింది.
ఇప్పుడు తత్వం బోధపడింది. ఈ నేపథ్యంలో హార్దిక్ కి బహుశా ముంబయి ఇండియన్స్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. అది నచ్చి హార్దిక్ ముంబయిలో చేరేందుకు ఆసక్తి చూపించారని అంటున్నారు. అయితే గుజరాత్ టైటాన్స్ కి హార్దిక్ ని పంపడం ఇష్టం లేదు. కానీ ఇక్కడ ఆటగాడిగా ఉండి మనస్ఫూర్తిగా ఆడకపోయినా ప్రమాదమే కాబట్టి, తను వెళతానంటే వెళ్లమన్నట్టు చెప్పినట్టు సమాచారం. తనకి లాభం వస్తే కాదనడానికి మనం ఎవరం అని వదలడానికి సిద్ధపడినట్టు వార్తలు వస్తున్నాయి.
హార్దిక్ పాండ్యా విషయంలో ముంబై ఇండియన్స్ జట్టు గుజరాత్ టైటాన్స్కు 15కోట్లు చెల్లించనుందని వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ మొత్తానికి అదనంగా ట్రాన్స్ఫర్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుందనీ, ఆ మొత్తంలో సగం హార్దిక్ పాండ్యాకు చెల్లిస్తారని తెలిసింది. మిగిలిన సగం గుజరాత్ టైటాన్ ఖాతాలోకి వెళతాయని అంటున్నారు. ఆ డబ్బులతో వాళ్లు మరో ముగ్గురి ఆటగాళ్లను కొనుక్కోవచ్చునని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ఐపీఎల్ లోనే అతి పెద్ద డీల్ గా ఇది ఉంటుందని అంటున్నారు.
కెప్టెన్లను వదిలించుకున్న ఫ్రాంచైజీల్లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఉన్నాయి. 2020 సీజన్లో పంజాబ్ కింగ్స్కు సారథిగా వ్యవహరించిన రవిచంద్రన్ అశ్విన్ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ట్రేడ్ ప్రక్రియలో సొంతం చేసుకుంది. ఆ తర్వాత కూడా మరో జట్టు కెప్టెన్ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా ఉన్న అజింక్య రహానేను సొంతం చేసుకుంది.
ఇలా ఒకే ఏడాది రెండు జట్ల కెప్టెన్లను సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ అదిరే ప్రదర్శన చేసింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఫైనల్కు దూసుకెళ్లింది. కానీ తుది పోరులో 2020లో ముంబయి ఇండియన్స్ చేతిలో ఓడి.. రన్నరప్గా నిలిచింది.
ఇప్పుడు ముంబయి, గుజరాత్ ఫ్రాంచైజీల మధ్య హార్దిక్ పాండ్యా విషయం ఎంతవరకు వచ్చిందనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ఈసారి ఐపీఎల్ వేలంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.