IPL : ఐపీఎల్ లో గుజరాత్ అదరగొడుతోంది. వరుసగా రెండో విజయం సాధించింది. తొలి మ్యాచ్ లో చెన్నైకి షాకిచ్చిన హార్దిక్ సేన.. రెండో మ్యాచ్ లో ఢిల్లీని చిత్తు చేసింది. సాయి సుదర్శన్ (62 నాటౌట్, 48 బంతుల్లో 4×4, 2×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. డేవిడ్ మిల్లర్ (31 నాటౌట్, 16 బంతుల్లో 2×4, 2×6) మెరుపులు తోడవడంతో 163 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సాయి సుదర్శన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
గుజరాత్ ఇన్నింగ్స్ ధాటిగానే ఆరంభమైనా ఆ జట్టు చకచకా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు సాహా (14), గిల్ (14)తో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యా (5) కూడా వెనుదిరిగాడు. ఆ దశలో సుదర్శన్, విజయ్ శంకర్ (29, 23 బంతుల్లో 3×4) ఇన్నింగ్స్ను నిలబెట్టారు. గెలవాలంటే గుజరాత్ చివరి అయిదు ఓవర్లలో 46 పరుగులు చేయాలి. ఈ దశలో మిల్లర్ చెలరేగి ఆడాడు. రెండు సిక్స్లు, ఫోర్ దంచడంతో 16వ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. తర్వాతి ఓవర్లో సుదర్శన్ ఫోర్, సిక్స్ కొట్టడంతో నోకియా 14 పరుగులిచ్చాడు. దీంతో మరో 11 బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ లక్ష్యాన్ని చేధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (36, 22 బంతుల్లో 2×4, 3×6) మెరిశాడు. వార్నర్ (37, 32 బంతుల్లో 7×4) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. షమి (3/41), అల్జారి జోసెఫ్ (2/29), రషీద్ ఖాన్ (3/31) ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేశారు. క్రమం తప్పకుండా వికెట్లు పడటంతో ఇన్నింగ్స్ జోరందుకోలేదు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు స్కోరు 78/4. షమి, అల్జారి జోసెఫ్ ఢిల్లీని గట్టి దెబ్బతీశారు. మూడో ఓవర్లో పృథ్వీ షా (7)ను ఔట్ చేసిన షమి.. తన తర్వాతి ఓవర్లో మిచెల్ మార్ష్ను బౌల్డ్ చేశాడు. అయితే మరోవైపు ఓపెనర్ వార్నర్ నిలిచాడు. కానీ అల్జారి జోసెఫ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి ఢిల్లీకి షాకిచ్చాడు. పదునైన పేస్తో హడలెత్తించిన జోసెఫ్ వరుస బంతుల్లో వార్నర్, రొసోలను వెనక్కి పంపాడు.
ఆ దశలో సర్ఫరాజ్ (30, 34 బంతుల్లో 2×4), అభిషేక్ పోరెల్ (20, 11 బంతుల్లో 2×6) నిలవడంతో ఢిల్లీ 12 ఓవర్లలో 100 పరుగులకు చేరుకుంది. ఆ తర్వాత అక్షర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. కానీ తొలుత చెలరేగిన ఢిల్లీ బౌలర్లు తర్వాత తేలిపోవడంతో గుజరాత్ సునాయాసంగా విజయం సాధించింది.