Ranji Trophy : ఏమిటీ క్రికెట్ లో వింత.. ఎక్కడా చూడలేదు.. ఇలాక్కూడా జరుగుతాయా? అని నెటిజన్లు అంటున్నారు. భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా జరిగే రంజీ ట్రోఫీలో ఒక సంచలనం నమోదైంది. కర్ణాటక వర్సెస్ గుజరాత్ మధ్య అహ్మాదాబాద్ లో రంజీ మ్యాచ్ ప్రారంభమైంది.
110 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కర్ణాటక రంగంలోకి దిగింది. 50 పరుగుల వరకు నో వికెట్. ఇంకేం ఉంది.. అంతా అయిపోయింది, అనుకునేలోపు ఒక బౌలర్ మ్యాజిక్ అక్కడ పనిచేసింది. దీపావళి టపాసులు పేలినట్లు టపటపా వికెట్లు ఎగిరిపడ్డాయి. అలా ఆ బౌలర్ విజ్రంభించి 7 వికెట్లు తీశాడు. దీంతో లక్ష్యానికి అవసరమైన మిగిలిన 60 పరుగులను కర్ణాటక టీమ్ చేయలేకపోయింది. అలా విజయానికి 6 పరుగుల దూరంలో ఆగి, పరాజయం పాలైంది.
ఇంతటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆ గుజరాత్ బౌలర్ పేరు సిద్ధార్థ్ దేశాయ్. తనకి తోడుగా మరో బౌలర్ రింకేష్ 3 వికెట్లు వెంటవెంటనే తీశాడు. వీరిద్దరి దెబ్బకు కర్ణాటక కుప్పకూలిపోయింది. చివరి వికెట్కు కౌశిక్ (4 నాటౌట్), ప్రసిద్ధ్ కృష్ణ (7), గెలిపిస్తారేమోనని ఆశించారు. కానీ ప్రసిద్ధ్ అవుట్ కావడంతో కర్ణాటక ఆశలు అడియాశలయ్యాయి.
తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన మయాంక్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దేవ్దత్ పడిక్కల్, మనీష్ పాండే స్టార్ బ్యాటర్లు ఉండి కూడా మ్యాచ్ ని కాపాడలేకపోయారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 264 పరుగులు చేసింది. బదులుగా కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 374 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో కర్ణాటకకు 110 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్లో గుజరాత్ 219 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అలా తొలి ఇన్నింగ్స్లో 110 పరుగులు వెనుకపడటంతో కర్ణాటక ముందు 110 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఆ 110 పరుగులు చేయలేకే కర్ణాటక జట్టు… కుప్పకూలిపోయింది. 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. గుజరాత్ విజయం సాధించింది. అందరూ ఇలాంటి మ్యాచ్ లు కూడా ఉంటాయా? ఇలాక్కూడా జరుగుతాయా? అని నెట్టింట కోట్స్ పెడుడుతున్నారు.