IPL : ఇదేం లెక్క అనుకుంటున్నారా? ఇప్పటివరకు జరిగిన అన్ని ఐపీఎల్ సీజన్లలో ఆడిన ఆటగాళ్లకు ఫ్రాంజైజీలు ఇచ్చిన మొత్తం జీతం దాదాపు రూ.6,500 కోట్లుగా లెక్క తేలింది. అంటే సగటున ప్రతీ ఐపీఎల్ సీజన్లో అన్ని ఫ్రాంచైజీలు కలిపి జీతాల కోసం ఖర్చు చేసిన మొత్తం రూ.430 కోట్లు. దీన్ని బట్టి చెప్పొచ్చు… ఐపీఎల్ అంటే కాసుల వర్షానికి మారు పేరు అని.
ఇక ఆటగాళ్లకు ఇచ్చే జీతాల కోసం అత్యధికంగా ఖర్చు చేసిన ఫ్రాంచైజీ ఏదో తెలుసా? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అవును. ఆర్సీబీ గత 15 సీజన్లలో ఆటగాళ్లకు జీతాల రూపంలో రూ.910.5 కోట్లు ఖర్చు చేసింది. అయినా… ఇప్పటిదాకా ఆర్సీబీ ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా నెగ్గకలేకపోయింది. ఇక ఆర్సీబీ తర్వాత ఎక్కువ జీతాలిచ్చిన ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్. అంబానీ ఫ్యామిలీ ముంబయి టీమ్ జీతాల కోసం రూ.884.5 కోట్లు ఖర్చు చేసింది. కోల్కతా నైట్రైడర్స్ రూ.852.5 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ రూ.826.6 కోట్లు, పంజాబ్ కింగ్స్ రూ.778.3 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ రూ.761.1 కోట్లు, సన్రైజర్స్ హైదరాబాద్ రూ.646.9 కోట్లు, రాజస్తాన్ రాయల్స్ రూ.613.3 కోట్లు ఆటగాళ్ల జీతాల కోసం ఖర్చు చేశాయి. ఇక ఈ ఏడాదే ఐపీఎల్లో అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్ రూ.89.2 కోట్లు, గుజరాత్ టైటాన్స్ రూ.88.3 కోట్లు జీతాల కోసం ఖర్చు చేశాయి.
జీతాల కోసం ఆర్సీబీ అత్యధికంగా ఖర్చు చేసినందని తెలియగానే… ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా కొట్టని జట్టుకు అన్ని వందల కోట్లా? అంటూ సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ గిబ్స్ ట్రోల్ చేశాడు. దానికి ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ కౌంటర్లు ఇస్తున్నారు. స్టార్ ప్లేయర్స్ ఉన్నా ఆర్సీబీ టైటిల్ గెలవలేకపోవడం వెనుక ఏదో అదృశ్య శక్తి ఉందని… సఫారీ జట్టులాగే ఆర్సీబీ కూడా చోకర్స్ అనిపించుకుంటోందని గిబ్స్కు ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.
మరోవైపు… జీతాల లెక్కలు చూసిన వారికి ఇప్పుడు మైండ్ బ్లాకవుతోంది. ఐపీఎల్ కాసుల వర్షం కురిపిస్తోందని తెలుసు గానీ… ఆటగాళ్లపై మరీ ఇలా వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారని తెలియదని అంతా అంటున్నారు. వచ్చే డిసెంబర్లో ఐపీఎల్-2023 మినీ వేలం జరగనుండటంతో… ఆటగాళ్ల జీతాల కోసం ఫ్రాంచైజీలు చేసే ఖర్చు ఇంకా భారీగా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు.