సౌతాఫ్రికా గడ్డపై జరుగుతున్న రెండో టెస్ట్ సంచలనాలకు వేదికగా మారింది. మొదటి రోజు బ్యాటర్లమీద బౌలర్లదే పైచేయిగా మారింది. 122 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఒకేరోజు 23 వికెట్లు నేలకూలడం రికార్డ్ బ్రేక్ గా చెబుతున్నారు. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అందుకు బదులుగా బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా 153 పరుగులకే చాప చుట్టేసింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 62 పరుగులతో పడుతూ లేస్తూ ఆడుతోంది. ఈ లెక్కన చూస్తే రెండో రోజే ఆట ముగిసిపోయేలా కనిపిస్తోంది.
మరొక ప్రమాదకర విషయం ఏమిటంటే టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 11 బంతుల్లో ఒక్క పరుగు కూడా జోడించకుండా చివిరి 6 వికెట్లు కోల్పోయింది. ఒక దశలో 4 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగా.. అదే స్కోర్ వద్ద ఆలౌట్ అయ్యింది. ఒకవేళ సౌతాఫ్రికా 100 పరుగుల టార్గెట్ ఇచ్చినా వీళ్లు ఇదే రీతిలో అవుట్ అయిపోతారా? అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ అయి, ఆ జట్టు పరువు పోతే, ఇలా ఒకే స్కోరు మీద 6 వికెట్లు పోగొట్టుకుని టీమ్ ఇండియా కూడా అంతే పరువు పోగొట్టుకుంది. సీనియర్లు రోహిత్, కోహ్లీ గానీ లేకపోతే ఈరోజు టీమ్ ఇండియా పరిస్థితి సౌతాఫ్రికా కన్నా ఘోరంగా ఉండేది. ఎందుకంటే గిల్ 36 పరుగులు చేశాడు. రాహుల్ 8 రన్స్ చేశాడు. 44 పరుగులకు మనవాళ్లు అంతా ఆలౌట్ అయిపోయేవారని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.
ఈరోజు మ్యాచ్ గెలిచినా, ఓడినా తొలిరోజు మాత్రం కోహ్లీ, రోహిత్ శర్మ, గిల్ పరువు పోకుండా కాపాడారని అంటున్నారు. నిజంగా సీనియర్ల లోటు స్పష్టంగా తెలిసింది. పుజారా, రహానే ఉండి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని అంటున్నారు. ఓపెనర్ యశస్వి జైశ్వాల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరి బదులు వారిని తీసుకువచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు.
యశస్వి జైశ్వాల్ అయితే కొత్తవాడు. ఇలాంటి కఠినమైన పిచ్ పై తనని నిందించడం కరెక్టు కాదు. కానీ శ్రేయాస్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక పది బాల్స్ కూడా ఆడటం లేదు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నుంచి అలాగే ఉంది. ఏదో స్పెషల్ గెస్ట్ లా వచ్చి వెళుతున్నాడు. అంటే తనకి నచ్చిన పిచ్, తనకి అలవాటైన ఆట అయితేనే ఆడతా, కొత్తగా నేర్చుకోను అన్నట్టుగానే ఉంది అతడి ఆట అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చూస్తుంటే ఇక్కడ ఫెయిలైన వారికి, భవిష్యత్తులో టెస్ట్ జట్టులో స్థానం ఉండకపోవచ్చునని అంటున్నారు.
మరోవైపు టీమ్ ఇండియా బ్యాటర్లనే నిందించడం సరికాదని కొందరు అంటున్నారు. సౌతాఫ్రికా బ్యాటర్లు కూడా బాల్ ఎలా వస్తుందో అంచనా వేయలేకపోయారు. ఇంత ఇంటర్నేషనల్ ప్లేయర్లు అయి ఉండి బౌలింగ్ పిచ్ పై ఇలా తేలిపోవడం విచిత్రంగానే ఉందని నెట్టింట ట్రోలింగులు బీభత్సంగా వస్తున్నాయి.
ఇంకోవైపు సిరాజ్ రికార్డు సృష్టించాడు. తొలి రోజు ఆటలో లంచ్ విరామంలోపు అయిదు వికెట్లు తీసిన భారత రెండో బౌలర్గా చరిత్రకెక్కాడు. సిరాజ్ కంటే ముందు 1987లో భారత్ తరపున మణిందర్ సింగ్ ఈ ఘనత సాధించాడు. పాకిస్థాన్తో జరిగిన ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో మణిందర్ ఏడు వికెట్లు పడగొట్టాడు. 36 ఏళ్ల తర్వాత ఈ అరుదైన జాబితాలో సిరాజ్ చేరడం విశేషం.
మరోవైపు భారత్తో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు. గతంలో 2015లో జరిగిన టెస్టులో సౌతాఫ్రికాను భారత్ 79 పరుగులకు ఆలౌట్ చేసింది. దానిని ఇప్పుడు బ్రేక్ చేసింది.
టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సౌతాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోర్ గా రికార్డులు చెబుతున్నాయి.
2018లో శ్రీలంకతో గాలే వేదికగా జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా 73 పరుగులకే కుప్పకూలింది.
2015లో నాగ్ పూర్ వేదికగా ఇండియాతో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా 79 పరుగులకు ఆలౌటైంది.
2015లో జోహెన్స్ బర్గ్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా 83 పరుగులో కుప్పకూలింది. టెస్ట్ క్రికెట్లో సౌతాఫ్రికాకు ఇవే అత్యల్ప స్కోర్లు.
2024 కొత్త సంవత్సరంలో ప్రారంభమైన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 55 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా 16 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నట్టయ్యింది. ఎందుకంటే 2008లో తొలి సెషన్లోనే టీమిండియాను 76 పరుగులకు సౌతాఫ్రికా కుప్పకూల్చింది.
మరి రెండో రోజు రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న సౌతాఫ్రికా, టీమ్ ఇండియాలు మరెన్ని రికార్డులు బ్రేక్ చేస్తాయో చూడాల్సిందే.