Bumrah:గాయం కారణంగా 8 నెలలుగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రాకు నయమైందో లేదో తెలీదు కానీ… ఫ్యాన్స్ మాత్రం అతనిపై ఓ రేంజ్ లో భగ్గుమంటున్నారు. దేశం కోసం ఆడకుండా ఇంకా ఎన్నాళ్లు గాయం సాకుతో తప్పించుకుంటావ్? అని ప్రశ్నిస్తున్నారు. కాసులు కురింపిచే ఐపీఎల్ దగ్గరికి వస్తోంది కదా… ఆ సమయానికల్లా బుమ్రా ఫిట్ అవుతాడు చూడండి అంటూ మరికొందరు అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. ఫ్యాన్స్ తనపై ఇంత ఆగ్రహంగా ఉన్నా… బుమ్రా ఎందుకు స్పందించడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు.
2022 జులై 1న చివరి టెస్ట్, జులై 14న చివరి వన్డే, సెప్టెంబర్ 25న ఆఖరి టీ-20 మ్యాచ్ ఆడాడు… బుమ్రా. వెన్నునొప్పి సమస్య కారణంగా నిరుడు ఆస్ట్రేలియాలో జరిగిన టీ-20 వరల్డ్ కప్ నుంచి కూడా తప్పుకున్నాడు. ఆ తర్వాత స్వదేశంలో జరిగిన సిరీస్ల కోసం అతణ్ని భారత జట్టులోకి ఎంపిక చేయడం, గాయం తగ్గలేదని మళ్లీ జట్టు నుంచి తప్పిచడం జరుగుతూ వస్తోంది. దాంతో… అసలు బుమ్రాకు అయిన గాయం తీవ్రత ఎంతో అర్థం కాక చాలా మంది అభిమానులు అయోమయంలో ఉన్నారు. అసలు బుమ్రా ఎప్పుడు ఆడతాడో కూడా బీసీసీఐ క్లారిటీ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం… బుమ్రా గాయం అంతా నాటకం అంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
ప్రస్తుతం బుమ్రా నేషనల్ క్రికెట్ అకాడమీకే పరిమితమయ్యాడు. గాయం తగ్గినా… అతణ్ని మళ్లీ జట్టులోకి తీసుకుని ఆడిస్తే గాయం తిరగబెట్టవచ్చని, అప్పుడు వన్డే వరల్డ్కప్కు కూడా దూరమవుతాడనే భయంతోనే… బీసీసీఐ బుమ్రాను ఎంపిక చేయడం లేదనే అనుమానాలు ఉన్నాయి. అయితే కొందరు అభిమానులు మాత్రం… వన్డే వరల్డ్కప్ను సాకుగా చూపిస్తూ బీసీసీఐ పెద్దలు లోలోపల బుమ్రాకు సహకరిస్తున్నారని… అతను పూర్తి ఫిట్గా ఐపీఎల్లో బరిలోకి దిగబోతున్నాడని అంటున్నారు. ఇందులో ఏది నిజమో తెలీక… చాలా మంది అభిమానులు అయోమయంలో ఉన్నారు.