England Star Cricketer Dawid Malan Announces Retirement from International Cricket: ఇంగ్లండ్ క్రికెట్ లో సంక్షోభం మొదలైనట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో జరిగే టీ 20, వన్డే సిరీస్ కు చాలామంది సీనియర్లను పక్కన పెట్టారు. దీంతో అక్కడ సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు వినిపస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్, టీ 20 స్పెషలిస్టు డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది.
2017లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి బ్యాటర్, ఆ తర్వాత అనతికాలంలోనే ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెం. 1 స్థానం దక్కించుకున్నాడు. ఇక ఎప్పటి నుంచో ఇంగ్లండ్ కి అందని ద్రాక్షగా ఉన్న… టీ 20 ప్రపంచకప్ ను అందించడంలో డేవిడ్ మలన్ కీలక పాత్ర పోషించాడు. 2022లో తను రాణించడం వల్లే ఇంగ్లండ్ కప్ కొట్టింది.
ఇకపోతే డేవిడ్ మలన్ ఇంగ్లండ్ తరఫున 62 టీ20లు ఆడాడు. ఇందులో 16 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. 1892 పరుగులు చేశాడు. అంతేకాదు పొట్టి క్రికెట్ లో అత్యంత వేగంగా 24 మ్యాచ్ ల్లో… 1000 పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. జోస్ బట్లర్ తర్వాత ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా మలన్ గుర్తింపు పొందాడు.
Also Read: రిషబ్ పంత్ సాయం: వద్దన్న విద్యార్థి
ఇక 2022 టీ20 వరల్డ్కప్ తర్వాత మలన్ కేవలం 15 ఇన్నింగ్స్లలో ఐదు సెంచరీలతో వన్డే క్రికెట్లోనూ సత్తా చాటాడు. మొత్తంగా ఆ జట్టు తరఫున 30 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. 1450 పరుగులు చేశాడు. అలాగే 22 టెస్టు మ్యాచ్ లు ఆడి 1074 పరుగులు చేశాడు. ఒక సెంచరీ చేశాడు.
భారత్ లో జరిగిన 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత మలన్ తిరిగి ఇంగ్లండ్ జట్టుకి ఎంపిక కాలేదు. ఇప్పటికే తన వయసు 37 సంవత్సరాలు కావడంతో అతన్ని పక్కన పెట్టారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తను అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడని అంటున్నారు. ప్రస్తుతం టీ 20 స్పెషలిస్టు బ్యాటర్ అయిన మలన్ ప్రస్తుతం ఐపీఎల్ లాంటి లీగ్ లపై ఫోకస్ పెట్టాడని అంటున్నారు. గతంలో పంజాబ్ జట్టు తరఫున 2021లో ఒక మ్యాచ్ ఆడాడు.