T20 World Cup 2022 : T20 వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది… శ్రీలంక. అద్భుత బౌలింగ్ తో ఐర్లాండ్ బ్యాటర్లను కట్టడి చేసిన లంక… ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ అదరగొట్టింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్… రెండో ఓవర్లోనే కెప్టెన్ ఆండీని కోల్పోయింది. ఒక్క పరుగే చేసి ఆండీ ఔటయ్యాడు. ఆ తర్వాత కూడా ఐర్లాండ్ బ్యాటర్లు లంక బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డారు. మరో ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 25 బంతుల్లో 34 పరుగులు చేసి ఔట్ కావడంతో… పది ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేయగలిగింది… ఐర్లాండ్. ఈ దశలో హ్యారీ టెక్టర్, జార్జ్ డాక్ రెల్… జాగ్రత్తగా ఆడారు. ఐదో వికెట్ కు 47 రన్స్ జోడించారు. చివరి ఓవర్లలోనూ బ్యాటర్లు ధాటిగా ఆడలేకపోవడంతో… 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 128 పరుగులే చేయగలిగింది… ఐర్లాండ్.
129 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన లంకకు… ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్ కు 63 పరుగులు జోడించారు. ధనుంజయ డిసిల్వ 25 బంతుల్లోనే 31 రన్స్ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన అసలంక కూడా… మరో ఓపెనర్ కుశాల్ మెండిస్ తో కలిసి ధాటిగా ఆడాడు. దాంతో 15 ఓవర్లకే 9 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది… శ్రీలంక. మెండిస్ 43 బంతుల్లోనే 68 రన్స్ చేయగా… అసలంక 22 బంతుల్లో 31 పరుగులు చేశాడు. అద్భుతంగా ఆడి లంకకు భారీ విజయాన్ని అందించిన కుశాల్ మెండిస్ కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.