President, PM Modi Congratulates Manu Bhaker On Bronze Win Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కి తొలి పతకం అందించిన యువ షూటర్ మను భాకర్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. 10 మీ ఎయిర్ పిస్టల్ లో మను కాంస్య పతకం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నిన్ను చూసి దేశం గర్వపడుతోందని అన్నారు. ఈ విజయం ఎంతోమంది క్రీడాకారులు, ఇంకా మహిళలకు స్ఫూర్తి దాయకమని ఎక్స్ వేదికగా కొనియాడారు.
ఇక దేశ ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు చెబుతూ ఇదొక అపురూపమైన విజయమని కొనియాడారు. భారత్ కు తొలి పతకం అందించి శుభారంభం అందించావని అన్నారు. అంతేకాదు రైఫిల్ షూటింగులో కాంస్య పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు స్రష్టించడం మరో ప్రత్యేకతని తెలిపారు.
అమ్మాయిలు అద్భుత ప్రదర్శన చేస్తున్నారని, తొలిపతకం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మన అమ్మాయిలు అద్భుత ఆరంభాన్నిచ్చారు. ఈ ఉత్సాహంతో మరిన్ని పతకాలు రావాలని ఆకాంక్షించారు. మనుభాకర్ ని మనస్ఫూర్తిగా అభినందించారు.
మనుభాకర్ ను చూసి మేమందరం గర్వపడుతున్నామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. యువ షూటర్ అసాధారణమైన ప్రతిభను చూపిందని అభినందించారు.
Also Read: పారిస్ ఒలింపిక్స్ లో.. నేడు భారత్ పోటీల షెడ్యూల్
ఈ సందర్భంగా మను భాకర్ మాట్లాడుతూ.. ఇదంతా ఒక కలలా ఉందని అన్నారు. ఈ గెలుపు వెనుక ఎంతోమంది ఉన్నారని తెలిపింది. ముఖ్యంగా కోచ్ జస్పాల్ రాణా, ఇంకా స్పాన్సర్లకు ధన్యవాదాలని తెలిపింది. ఈ విజయం సాధించడంలో నా శక్తినంతా ధారపోశానని తెలిపింది. ఒలింపిక్స్ లో మరిన్ని పతకాలు సాధించాలి. భారత్ ఎందులోనూ తక్కువ కాదని తెలిపింది.
కాంస్య పతకం నుంచి ఇంకా ముందుకు వెళతాను. భవిష్యత్తులో మరింత కష్టపడి మంచి ప్రదర్శన చేస్తానని తెలిపింది. అయితే రిజల్ట్ వచ్చేటప్పుడు ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యాను. అందుకే ఫలితాన్ని దేవుడికే వదిలేశాను. నా పని నేను చేశాను. ఇంక నీదే భారమని మనసులో అనుకున్నట్టు తెలిపింది. తుది ఫలితం ఎప్పుడూ మన చేతిలో ఉండదని తెలిపింది. కానీ మొత్తానికి పతకమైతే వచ్చిందని తెలిపింది. 12 ఏళ్ల తర్వాత షూటింగులో పతకం రావడం పట్ల ఆనందంగా ఉందని తెలిపింది.