India New sponsor Dream 11 : ఇండియన్ నేషనల్ టీమ్ను స్పాన్సర్ చేయడానికి ఎన్నో పెద్ద పెద్ద బిజినెస్ కంపెనీలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి. తాజాగా ఈ స్పాన్సర్షిప్ గురించి బీసీసీఐ ప్రకటన చేసిన దగ్గర నుండి దీని కోసం పోటీ మొదలయ్యింది. ఎన్నో కంపెనీలు టెండర్ వేసిన తర్వాత ఈ అవకాశం ఫ్యాంటసీ గేమింగ్ కంపెనీ డ్రీమ్ 11 దక్కించుకుంది. మూడేళ్ల వరకు ఇండియన్ నేషనల్ టీమ్కు ఈ సంస్థ స్పాన్సర్గా బాధ్యతలు నిర్వర్తించనుంది.
ప్రస్తుతం టీమిండియా.. వెస్టిండీస్ టూర్కు సిద్ధమవుతోంది. అక్కడ పలు టెస్ట్ సిరీస్లో పాల్గొననుంది. ఈ సిరీస్ నుండే కొత్త స్పాన్సర్స్ అయిన డ్రీమ్ 11ను ప్రమోట్ చేస్తూ టీమిండియా కనిపించనుంది. టీమిండియా జెర్సీలపై డ్రీమ్ 11 గుర్తులు కనిపించనున్నాయి. 2023 నుండి 2025 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు సంబంధించి టీమిండియా ఆడనున్న మొదటి టెస్ట్ సిరీస్ ఇది. కానీ డ్రీమ్ 11.. ఎంత టెండర్ వేసి ఈ స్పాన్సర్షిప్ను దక్కించుకుంది లాంటి వివరాలను బయటికి రానివ్వలేదు.
ఇప్పటివరకు బైజూస్ అనే ఎడ్యుకేషన్ సంస్థ.. టీమిండియాకు స్పాన్సర్షిప్ను అందిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ బాధ్యతలు డ్రీమ్ 11 అందుకుంది. మార్చ్లో బైజూస్ స్పాన్సర్షిప్ పూర్తయిన తర్వాత బీసీసీఐ టెండర్లకు ఆహ్వానం పలికింది. ‘డ్రీమ్ 11కు శుభాకాంక్షలు, మరోసారి వారికి వెల్కమ్’ అంటూ బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్ని ప్రకటించారు. టీమిండియాతో డ్రీమ్ 11కు సంబంధం రోజురోజుకీ బలపడుతూ వస్తుందని ఆయన తెలిపారు.
ఈ ఏడాది చివర్లో ఐసీసీ వరల్డ్ కప్ను నిర్వహించడానికి బీసీసీఐ సన్నాహాలు చేస్తుండగా.. డ్రీమ్ 11 అనేది ఫ్యాన్స్కు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనడంలో సందేహం లేదని రోజర్ అన్నారు. నేషనల్ క్రికెట్ విషయంలో స్పాన్సర్షిప్ను డ్రీమ్ 11 దక్కించుకోగా.. ఇండియాకు కిట్ స్పాన్సర్గా అదిదాస్ బాధ్యతలు దక్కించుకుంది. 2028 మార్చ్ వరకు టీమిండియాకు కావాల్సిన కిట్స్ అన్నీ అదిదాస్ అందించనుంది.