Rishabh Pant: ముందుగా అనుకున్న ప్రయాణం కాదు. అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాడు. ఇంట్లో వారికి సర్ప్రైజ్ ఇద్దామనుకుని చెప్పకుండా బయలుదేరాడు. సింగిల్ గా తన బెంజ్ కారు వేసుకొని.. ఢిల్లీ నుంచి రూర్కీ బయలుదేరాడు. ఖాళీ రోడ్డు.. చేతిలో బెంజి కారు.. ఎక్స్ లేటర్ తొక్కితే.. స్పీడుకు హద్దులు లేకుండా పోయాయి. “స్పీడ్ థ్రిల్స్.. బట్ కిల్స్” అనే కొటేషన్ ఆ టైమ్ లో గుర్తుకు రానట్టుంది. ఓవర్ స్పీడ్ తో కారు అదుపు తప్పింది. డివైడర్ కు ఢీ కొట్టింది. ప్రమాదంలో క్రికెటర్ రిషభ్ పంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. సర్ప్రైజ్ ఏమోగానీ, ఇప్పుడు వారి కుటుంబ సభ్యులకు బిగ్ షాక్ తగిలింది.
యాక్సిడెంట్ తీవ్రతకు కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అతడు కారు విండో పగలగొట్టుకుని బయటకు దూకేశాడు. ఘటనలో పంత్ తల, మోకాలికి గాయాలయ్యాయి. కాలికి ఫ్యాక్చర్ అయింది. వీపు భాగం కాలిపోయింది. ప్రమాద తీవ్రతకు బెంజి కారు పూర్తిగా కాలిపోయి.. నామరూపాలు లేకుండా పోయింది.
రిషభ్ పంత్ను రూర్కీలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించి.. మెరుగైన చికిత్స కోసం దేహ్రాదూన్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. రోడ్డు ప్రమాదం గురించి తెలియగానే అతడి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చారు.
పంత్ త్వరగా కోలుకోవాలంటూ పలువురు క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గెట్ వెల్ సూన్ ఛాంప్ అంటున్నారు.
ఇటీవల బంగ్లాతో టెస్టు సిరీస్ ఆడిన పంత్.. శ్రీలంకతో టీ20 సిరీస్కు మాత్రం ఎంపిక కాలేదు. లేటెస్ట్ గా క్రిస్మస్ వేడుకలను.. ధోనీతో కలిసి దుబాయ్లో చేసుకున్నాడు పంత్.