Shikhar Dhawan : శిఖర్ ధావన్ టీమిండియా వన్డే వరల్డ్ కప్ జట్టులో లేడు. కానీ ట్రెండింగ్ లో ఉన్నాడు. ఎందుకో తెలుసా. ధావన్ విడాకులపై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అందుకే ధావన్ హాట్ టాపిక్ మారాడు.
భార్య ఆయేషా ముఖర్జీతో డైవర్స్ కోసం కోర్టును ధావన్ ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయేషా ముఖర్జీ క్రూర ప్రవర్తన కారణంగానే విడాకులు మంజూరు చేస్తున్నామని న్యాయస్థానం తీర్పు వెలువరించడం సంచలనం రేపుతోంది.
అసలు శిఖర్ ధావన్ భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆమె ధావన్ ను ఏ విధంగా వేధించారు? ఈ అంశాలు తెలుసుకుందాం.ఆయేషా ముఖర్జీ ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్. ఆమెను ధావన్ 2012లో వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమారుడు జన్మించాడు. ఆమెకు ధావన్ కంటే ముందు మరో వ్యక్తితో పెళ్లి అయ్యింది. ఇద్దరు కుమార్తెలున్నారు. ఆమె మొదటి భర్తతో విడిపోయిన తర్వాత ధావన్ ను రెండో పెళ్లి చేసుకున్నారు.
8 ఏళ్ల కాపురం తర్వాత ధావన్, అయేషా మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో 2020 నుంచి దూరంగా ఉంటున్నారు. ధావన్ నుంచి తాను విడిపోతున్నట్లు 2021లో ఆయేషా ఇన్స్టా వేదికగా ప్రకటించారు.
తాము విడిపోతున్నామని రెండేళ్ల క్రితం శిఖర్ ధావన్ కూడా ప్రకటించాడు. భార్య మానసికంగా వేధిస్తోందని ఆరోపించాడు. విడాకుల కోసం ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. అతడు ధాఖలు చేసిన డైవర్స్ పిటిషన్పై విచారణ జరిపిన కుటుంబ న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. భార్య ఆయేషా ముఖర్జీపై ధావన్ చేసిన ఆరోపణలను కోర్టు సమర్థించింది. ఈ ఆరోపణలు నిజం కావని ఆయేషా రుజువు చేసుకోలేకపోయారని స్పష్టం చేసింది. కుమారుడికి దూరంగా ఉండాలని ధావన్ను భార్య మానసికంగా వేధించారని కోర్టు నిర్ధారించింది.
అయేషా తొలుత శిఖర్ ధావన్తో కలిసి భారత్లో ఉండేందుకు అంగీకరించింది. కానీ తన మొదటి భర్తతో కలిగిన సంతానాన్ని చూసుకునేందుకు ఆస్ట్రేలియాలోనే ఉండిపోయింది. దీంతో ధావన్ తన కుమారుడికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక ధావన్ తన సొంత డబ్బుతో ఆస్ట్రేలియాలో కొనుగోలు చేసిన మూడు ఆస్తులపై తనకు యాజమాన్య హక్కులు కల్పించాలని ఆమె ఒత్తిడి చేసినట్లు కోర్టు నిర్ధారించింది. ఈ ఆరోపణలను ఆమె వ్యతిరేకించలేదు. అందువల్ల ఈ విషయాలు వాస్తవమేనని న్యాయస్థానం తీర్పు వెల్లడించింది.
శిఖర్ ధావన్ పరువుకు భంగం కలిగించేలా ఆయేషా ఉద్దేశపూర్వకంగా తోటి క్రికెటర్లు, బీసీసీఐ, ఐపీఎల్ జట్టు యాజమాన్యానికి తప్పుడు సందేశాలు పంపించినట్లు విచారణలో తేలింది. తన మొదటి భర్తతో కలిగిన ఇద్దరు కుమార్తెల ఫీజులు, ఇతర ఖర్చుల కోసం కూడా ఆమె డబ్బులు డిమాండ్ చేసినట్లు కోర్టు గుర్తించింది.ధావన్ చేసిన ఆరోపణలన్నీ నిజమని తేలడంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే తన కుమారుడి శాశ్వత కస్టడీ కోసం ధావన్ చేసిన అభ్యర్థనపై తీర్పు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కుమారుడితో వీడియో కాల్ ద్వారా టచ్లో ఉండేందుకు అనుమతించింది. స్కూల్ వెకేషన్ సమయంలో ఆయేషా తన కుమారుడిని భారత్కు తీసుకొచ్చి ధావన్ కుటుంబంతో సమయం గడిపేలా చూడాలని కోర్టు ఆదేశించింది.