Delhi capitals 2023 : ఈ సీజన్ ఐపీఎల్లో ఇప్పటి వరకు బోణీ కొట్టని ఒకే ఒక్క జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. మంచి జట్టు, మంచి ఆటగాళ్లు, మంచి మేనేజ్మెంట్. హెడ్ కోచ్గా ది గ్రేట్ రికీ పాంటింగ్. ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్గా దాదా గంగూలీ. ఇంత మంది ఉన్నారు. అయినా సరే ఈ జట్టుకు ఒక్కటంటే ఒక్క విజయం కూడా దక్కలేదు.
జట్టు విఫలం అవుతుంటే.. ప్రధానంగా ఎఫెక్ట్ పడేది కెప్టెన్ డేవిడ్ వార్నర్ పైనే. అయితే, కెప్టెన్గా వార్నర్ బాగానే రాణిస్తున్నాడు. సో, ఓటములకు బాధ్యత తీసుకోవాల్సిన పొజిషన్లో ఉన్న ఆ తరువాత వ్యక్తి హెడ్ కోచ్ రికీ పాంటింగ్. ఆస్ట్రేలియా కెప్టెన్గా రికీ పాంటింగ్ ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. వ్యూహాలు పన్నడంలోనూ, ఫీల్డింగ్ సెట్ చేయడంలోనూ, బౌలర్లను ఉపయోగించుకోవడంలోనూ తనకు తనే సాటి. అలాంటి రికీ పాంటింగ్కు కూడా ఢిల్లీ జట్టును ఎలా గట్టెక్కించాలో తెలియడం లేదు. ఈ సీజన్ మరీ ఇంత దారుణంగా ఉంటుందని అస్సలు ఊహించలేదు. కాని, అంతా దైవాదీనం, అదృష్టం అని ఊరుకోలేరుగా. టీమ్ మేనేజ్మెంట్ ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు కనిపిస్తోంది. అర్జెంటుగా ఎవరో ఒకరి పదవిని తీసేయాలన్నంత కోపంతో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఆ వ్యక్తి ఎవరో కాదు రికీ పాంటింగే అని చెప్పుకుంటున్నారు.
చెప్పుకోడానికి ఢిల్లీకి పెద్ద టీం ఉంది. గ్రౌండ్లో ఆడేవాళ్లే కాదు.. గ్రౌండ్ బయట ఉండే వారి లిస్ట్ కూడా పెద్దదే. హెడ్ కోచ్గా రికీ పాంటింగ్తో పాటు షేన్ వాట్సన్, జేమ్స్ హోప్స్, అజిత్ అగార్కర్, ప్రవీణ్ ఆమ్రే, బిజూ జార్జ్ ఢిల్లీ జట్టుకు అసిస్టెంట్ కోచ్లుగా వ్యవహరిస్తున్నారు. గంగూలీ కూడా ఢిల్లీ జట్టుకే సేవలు అందిస్తున్నాడు. ఇప్పుడు వీళ్లందరిలోనూ టెన్షన్, ఫ్రస్టేషన్ పెరిగిపోయాయి. మేనేజ్ మెంట్కు మొహం చూపించలేని పరిస్థితిలో ఉన్నారు. ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియడం లేదు. అందుకే, మేనేజ్మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసి… విపరీత నిర్ణయం తీసుకున్నా సరే.. దానికి అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
వచ్చే మ్యాచ్లో గెలిస్తే తప్ప వీళ్లకు ఊరట దొరకదు. లేదంటే.. మేనేజ్ మెంట్ ఆగ్రహానికి గురికాక తప్పదు.