Defamation Case On MS Dhoni : ఒకప్పుడు టీమ్ ఇండియాను విజయపథంలో నడిపించి క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న మహేంద్ర సింగ్ ధోనీపై ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం కేసు దాఖలయ్యింది. ధోనీ మాజీ బిజినెస్ పార్ట్నర్స్ మిహిర్ దివాకర్, అతని భార్య సౌమ్య దాస్ ఈ కేసు పెట్టారు. తమపై ధోనీ అసత్య ఆరోపణలు చేశాడని, ఆ దంపతులు కోర్టును ఆశ్రయించారు. గురువారం ఢిల్లీ హైకోర్టువిచారణ చేపట్టనుంది.
అంతేకాదు, నిజానిజాలను పట్టించుకోకుండా, ఒక వ్యక్తి చెప్పిన మాటలను యథాతథంగా ప్రచురించి, తమకు మనోవేదన కలిగించిన పోస్ట్లు, వాటిని అనుమతించిన సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ ఎక్స్, గూగుల్, ఫేస్బుక్ , ఇంకా ఈ వార్తలను ప్రచురించిన పత్రికలు, టీవీ ఛానళ్లపై కూడా పరువు నష్టం దావా వేశారు.
ఒక వ్యాపార వ్యవహారంలో ఒక అగ్రిమెంట్ విషయంలో ధోనీకి, ఇప్పుడు కేసు వేసిన మిహిర్ దివాకర్, సౌమ్యాదాస్ మధ్య వివాదం మొదలైంది. విషయం ఏమిటంటే ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ లిమిటెట్ పేరిట దేశవ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో 2017లో సదరు సంస్థ ధోనీతో ఒప్పందం చేసుకుంది. అనంతరం అగ్రిమెంట్ లో భాగంగా తనకి రావల్సిన రాయల్టీని చెల్లించడం లేదని ధోనీ అభియోగం.
తాను ఎన్నిసార్లు మాట్లాడినా వారిలో స్పందన లేదని ధోనీ అంటున్నాడు. దీంతో విసుగెత్తిన ధోనీ వారితో అగ్రిమెంట్ రద్దు చేసుకున్నాడు. అంతేకాదు పలుమార్లు లీగల్ నోటీసులు పంపించాడు. అయినా స్పందన లేకపోవడంతో రాంచీ కోర్టులో రూ.15 కోట్లు నష్టపరిహారంగా ఇప్పించమని, పరువు నష్టం కలిగించారంటూ క్రిమినల్ కేసు వేశాడు.
ఈ విషయాన్ని ధోనీ తరఫు న్యాయవాది మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పాడు. అంతేకాదు అగ్రిమెంట్ రద్దు చేసుకున్న తర్వాత కూడా దేశవ్యాప్తంగా ధోనీ పేరిట క్రికెట్ అకాడమీలను ప్రారంభించారని న్యాయవాది ఆరోపించారు.
దీంతో ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ లిమిటెట్ యజమానులైన దివాకర్, సౌమ్యలు రంగంలోకి దిగారు. ధోనీ కేసు వేయడంతో తాము నెలకొల్పిన సంస్థలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని, తద్వారా తమకు డ్యామేజి జరిగిందని, ధోనీ చెబుతున్నదంతా అసత్యమని వారు పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలతో తమ పరువుకు భంగం కలిగించాడని వారు ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు.