మిగ్జాం తుపాను తీరం దాటింది. కానీ చెన్నైలోని ప్రజల బతుకులు మాత్రం చిన్నాభిన్నమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నగరమంతా జలమయమైంది. ఇల్లూ, వాకిలీ అన్నీ నీట మునిగి, సర్వం నష్టపోయిన ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఎవరైనా రాకపోతారా? తమని ఆదుకోలేకపోతారా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రజలకు రక్షణ చర్యలు చేపట్టాలన్నా ప్రతికూల వాతావరణంతో రెస్క్యూ టీమ్ కి సాధ్యపడటం లేదు. ఎక్కడికక్కడ కరెంటు పోయింది. విద్యుత్ తీగలు నీటిలో పడి ఉన్నాయి. త్వరగా చీకటి పడటంతో ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.
ఈ సమయంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. మానవతా దృక్పథంతో చెన్నై ప్రజలను ఆదుకోవాలని తన అభిమానులను కోరాడు. ఎవరికి తోచిన సాయం, వారు చేయాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశాడు.
భారత క్రికెటర్లు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రజలు బయటకు వెళ్లవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇళ్లల్లోనే ఉండాలని తెలిపారు. ఈ విపత్తును అందరం కలిసి కట్టుగా ఎదిరిద్దాం అని వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ పిలుపునిచ్చాడు.
ఒక నెటిజన్ కరెంటు ఎప్పుడొస్తుందో ఎవరైనా చెప్పండి అంటూ తన ప్రాంత ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి చెన్నై వాసి, క్రికెటర్ అశ్విన్ స్పందించారు.
మా ఏరియాలో 30 గంటలకు పైగా కరెంటు లేదు. చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మనకు ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయో తెలీదు..అని ట్వీట్ చేశాడు.
అలాగే నెటిజన్లకు ఒక సందేశం పంపాడు. పరిస్థితి ఏమాత్రం బాలేదు. వర్షం ఆగిపోయినా.. సాధారణ స్థితిలోకి వచ్చేందుకు చాలా సమయం పడుతుంది. అంతవరకు బయటకు రావద్దని చెన్నై పౌరులకు అశ్విన్ సూచించాడు. ఈ విపత్కర పరిస్థితిని అందరం కలిసి ఎదిరిద్దామని తెలిపాడు.
సెలబ్రిటీలు అందరూ ముందుకొస్తున్నారు. ఇంక సినిమావాళ్లు కూడా వస్తారని ఎదురుచూస్తున్నారు. ప్రముఖ క్రికెటర్లు అందరూ కూడా స్పందిస్తారని అనుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్, తలైవర్ విజయ్, విశాల్ తదితరులు స్పందిస్తారు. ప్రస్తుతం వారి మాట కోసం అంతా ఎదురు చూస్తున్నారు.
అయితే విశాల్ పోస్ట్ మాత్రం కలకలం సృష్టించింది. రాజకీయ నాయకులు, ప్రముఖలు అందరూ క్షేమమే కదా, మీ ఇళ్లల్లోకి నీళ్లు రాలేదు కదా, అని వ్యంగ్యంగా పోస్ట్ పెట్టాడు. మీరు ముందే ఆ పేదవారి కోసం ఆలోచించి ఉంటే, డ్రైనేజీలు తీసి, కాల్వలు తవ్వితే ఈ రోజు ఈ దౌర్భాగ్యం వచ్చేది కాదు కదా అన్నాడు. ఇది నెట్టింట వైరల్ గా మారింది.