Cricketer Death : భారతదేశమంతటా క్రికెట్ ఫీవర్ ఊపేస్తోంది. చిన్నా పెద్దా అందరూ కూడా ఖాళీ సమయం దొరికితే చాలు క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్స్ లోకి పరుగులు తీస్తున్నారు. అలాగే ముంబయిలో కూడా వెటరన్స్ కోసం అంటే 50 ఏళ్లు దాటిన వారికి స్థానికంగా ఒక అసోసియేషన్ ఐపీఎల్ తరహాలో ప్రైవేటు లీగ్ నిర్వహిస్తోంది. దాని పేరు కుచ్చి వీసా ఓస్వాల్ వికాస్ లెజెండ్ కప్ అన్నమాట. ఇందులో చాలామంది వెటరన్స్ అంటే ఒకప్పుడు క్రికెట్ ఆడినవారు ఉత్సాహంగా చేరారు.
ముంబయిలోని దాదర్ పార్సీ కాలనీలోని స్పోర్టింగ్ క్లబ్ గ్రౌండ్లో మ్యాచ్ లు జరుగుతున్నాయి. అయితే టీమ్ లు ఎక్కువ కావడంతో, ఒకే గ్రౌండ్ లో ఒక సమయంలో పక్కపక్కనే రెండేసి మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు.
ఈ సమయంలో పక్క మ్యాచ్ నుంచి ఒకరు బాల్ త్రో చేశారు. అది ఇవతల మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న జయేష్ సవాలా తలకు బలంగా తాకింది.. దాంతో ఆయన అక్కడికక్కడే పడిపోయాడు.
అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే జయేశ్ మరణించినట్టు వైద్యులు తెలిపారు. అయితే ఆ బంతి చెవి వెనుక తగిలిందని, అది సున్నితమైన ప్రాంతం కావడం వల్లే మరణించాడని తోటి ఆటగాళ్లు తెలిపారు. అప్పుడప్పుడు గాయాలు అవుతుంటాయని, చనిపోవడం మాత్రం ఇదే మొదటిసారని వారు అంటున్నారు. ఇక నుంచి ఏకకాలంలో రెండేసి మ్యాచ్ లు ఆడకూడదని నిర్ణయం తీసుకున్నట్టు వారు తెలిపారు.
ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ ఘటనలో ఎటువంటి కుట్ర, కక్ష లేదని, ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదని పేర్కొన్నారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.
సాయంత్రం 5 గంటల సమయంలో జయేష్ మృతి చెందినట్లు లయన్ తారాచంద్ ఆసుపత్రి వైద్యాధికారి తెలిపారు. ఈ ఘటనతో ఎవరికి వారు షాక్ లో ఉండిపోయారు. అంతవరకు కేరింతలు, కేకలు, అరుపులతో కళకళలాడిన గ్రౌండ్ ఒక్కసారిగా బోసిపోయింది.