Controversial Umpiring Decision in SA Vs BAN T20 World Cup Match 2024: అన్నీ బాగా జరిగి, మ్యాచ్ గెలిస్తే ఎవరికీ ఏవీ గుర్తుండవు. కానీ ఓడిపోతే మాత్రం.. రంధ్రాన్వేషణ మొదలెడతారు. అలాగైతే బాగుండేది, ఇలాగైతే బాగుండేదని అంటారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఓడిపోయింది. అయితే సరిగ్గా 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాకపోతే ఇక్కడే చిన్న ట్విస్ట్ జరిగింది.
నిజానికి బంగ్లాదేశ్ కి ఒక బౌండరీ వచ్చింది. అయితే అంపైర్ తప్పిదం కారణంగా అవి వారి ఖాతాలో పడలేదు. అదిగానీ వచ్చి ఉంటే, బంగ్లాదేశ్ గెలిచేది కదా.. అని నెట్టింట ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది.
వివరాల్లోకి వెళితే…దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి 113 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ ఒక దశలో దూకుడుగానే కనిపించింది. అలా విజయానికి చివరి 4 ఓవర్లలో 27 పరుగులు చేయాల్సి వచ్చింది. 17 ఓవర్ లో దక్షిణాఫ్రికా బౌలర్ బార్ట్ మన్ వేసిన రెండో బంతి ఏమైందంటే.. బంగ్లా ఆటగాడు మహ్మదుల్లా ప్యాడ్లకు తాకి స్టంప్స్ వెనుక నుంచి బౌండరీకి వెళ్లింది.
Also Read: ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో భారత్.. ఏడో ప్లేస్లో పాకిస్థాన్..
దక్షిణాఫ్రికా జట్టు ఎల్బీకి అప్పీలు చేసింది. దీంతో అంపైర్ అవుట్ గా ప్రకటించాడు. దీంతో బంగ్లాదేశ్ డీఆర్ఎస్ కి వెళ్లింది. అది నాటౌట్ అని తేలింది. అయితే అక్కడే రూల్స్ అడ్డు వచ్చాయి. నిజానికి వికెట్ల ముందు అవుట్ అయితే, ఆ బంతికి ఎన్ని పరుగులు చేసినా రావు. ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ నాటౌట్ అని వచ్చింది. అప్పుడు బౌండరీకి వెళ్లిన 4 పరుగులు రావాలి కదా.. కానీ రాలేదు.
అదే ఇప్పుడు నెట్టింట వేడివేడి చర్చ జరుగుతోంది. ఐసీసీ నిబంధన ప్రకారం.. అంపైర్ మొదట అవుట్ అనడం వల్ల, ఆ బాల్ డెడ్ బాల్ గా మారిపోయింది. అందుకే పరుగులు కలపలేదు. కానీ డీఆర్ఎస్ ప్రకారం.. నాటౌట్ అని తేలడంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కానీ పోయిన 4 రన్స్ మాత్రం తిరిగి రాలేదు. ఇప్పుడదే నాలుగు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. అందుకే నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది.
Also Read: దక్షిణాఫ్రికా ‘మహరాజ్’.. బంగ్లాదేశ్ పై గెలిపించిన మనవాడు
నిజానికి ఇండియా-పాక్ మ్యాచ్ లో కూడా 7 పరుగుల వద్ద రిజ్వాన్ క్యాచ్ ని శివమ్ దుబె వదిలేశాడు. అయితే టీమ్ ఇండియా గెలిచింది కాబట్టి దానిని అందరూ మరిచిపోయారు. ఇప్పుడు బంగ్లాదేశ్ గెలిచి ఉంటే, ఆ నాలుగు పరుగులని వదిలేసేవారు. ఓడిపోయింది కాబట్టి, ఆ నాలుగు పరుగులు అంటూ అందరూ గుర్తు చేసుకుని బాధ పడుతున్నారు.