IPL Match Updates(RCB vs CSK): ఐపీఎల్ లో మరో మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి కిక్కు ఇచ్చింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో చెన్నై 8 పరుగుల తేడాతో బెంగళూరుపై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది.
ఓపెనర్ డెవాన్ కాన్వే (83, 45 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులు), శివమ్ దూబె ( 52, 27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులు), రహానె( 37 , 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) దంచి కొట్టడంతో ధోనిసేన భారీ స్కోర్ సాధించింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ మినహా మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
227 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి ఓవర్ లోనే కోహ్లీ (6) వికెట్ ను కోల్పోయింది. జట్టు స్కోర్ 15 పరుగుల వద్ద మహిపాల్ లోమ్రోర్ (0 ) కూడా పెవిలియన్ చేరాడు. అయితే కెప్టెన్ డుప్లెసిస్ ( 62, 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులు) మాక్స్ వెల్ (76, 36 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులు ) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడటంతో బెంగళూరు విజయంపై ఆశలు చిగురించాయి.
రెండు ఓవర్ల వ్యవధిలో మాక్స్ వెల్, డుప్లెసిస్ అవుట్ కావడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. దినేష్ కార్తీక్ (28), సుయాశ్ ప్రభు దేశాయ్ (19) కాసేపు మెరుపులు మెరిపించినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది.
చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 3 వికెట్లు, పతిరన రెండు వికెట్లు పడగొట్టారు. ఆకాష్ సింగ్, మహీశ్ తీక్షణ, మొయిన్ అలీ తలో వికెట్ తీశారు. అద్భుత బ్యాటింగ్ విన్యాసాలతో చెన్నై భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించిన కాన్వేకు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.