Rishabh Pant: రిషభ్ పంత్(Rishabh Pant) ది మామూలు యాక్సిడెంట్ కాదు. హైరేంజ్ సేఫ్టీ ఫీచర్స్ ఉండే బెంజ్ కారే నుజ్జునుజ్జు అయింది. మంటలు చెలరేగి కారంతా కాలిపోయింది. యాక్సిడెంట్ స్పాట్ చూస్తేనే తెలుస్తోంది ఎంత ఘోరమైన ప్రమాదమో. పంత్ ఓవర్ స్పీడ్ గా కారు నడపడం.. నిద్రమత్తులో అదుపుతప్పి డివైడర్ ను గుద్దేయడంతో యాక్సిడెంట్ జరిగింది. మరి, అంత తీవ్రమైన ప్రమాదం నుంచి రిషభ్ ఎలా బయటపడ్డాడు? ఆయన్ను మొదట ఎవరు చూశారు? ఎవరు కాపాడారు? ఎలా కాపాడారు? హాస్పిటల్ లో చేర్చింది ఎవరు?
వికెట్కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant)ను ఓ బస్సు డ్రైవర్ ప్రమాదం నుంచి కాపాడాడు. శుక్రవారం తెల్లవారుజామున రూర్కీ సమీపంలో పంత్ కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఆ సమయంలో ఆటుగా వెళ్తున్న బస్సు డ్రైవర్ సుశీల్ మాన్ ఈ ప్రమాదాన్ని చూశాడు. పంత్ కారు డివైడర్ను ఢీకొని దాదాపు 200 మీటర్లు దూసుకెళ్లింది. అది చూసి వెంటనే బస్సును రోడ్డు పక్కన ఆపేసి ప్రమాదం జరిగిన కారు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లాడట డ్రైవర్ సుశీల్.
అప్పటికే పంత్ కారు విండోను పగలగొట్టుకుని.. సగం బయటకు వచ్చాడు. డ్రైవర్ ను చూసి తానొక క్రికెటర్నని చెప్పాడు. తన తల్లికి ఫోన్ చేయమని డ్రైవర్ ని అడిగాడు.
తాను క్రికెట్ చూడనని అందుకే పంత్ ను గుర్తుపట్టలేకపోయానని బస్ డ్రైవర్ సుశీల్ మాన్ అన్నాడు. కానీ, ఆ బస్సులోని ప్రయాణికులు మాత్రం రిషభ్ ను గుర్తుపట్టారు. అతడిని వెంటనే కారు నుంచి బయటకు లాగారు. వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసి.. హాస్పిటల్ కు తరలించారు. కారులో ఉన్న బ్లూ కలర్ బ్యాగ్, 7వేల క్యాష్ ను కూడా పంత్ కు ఇచ్చామని అతడిని కాపాడిన బస్సు డ్రైవర్ తెలిపాడు. ఇదీ జరిగింది. ప్రస్తుతం హాస్పిటల్ లో కోలుకుంటున్నారు రిషభ్ పంత్.