Bumrah ready for re entry: టీమిండియా స్టార్ ఫాస్ట్బౌలర్ జస్ప్రీత్ బుమ్రా… మళ్లీ భారత క్రికెట్ జట్టులో చేరబోతున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్కు బుమ్రాను జట్టులోకి ఎంపిక చేసింది… బీసీసీఐ. అతని ఫిట్నెస్పై అనుమానాలతో శ్రీలంకతో టీ-20 సిరీస్తో పాటు వన్డే సిరీస్కూ బుమ్రాను దూరం పెట్టారు…. సెలెక్టర్లు. అయితే బుమ్రా పూర్తిగా కోలుకున్నాడని జాతీయ క్రికెట్ అకాడమీ నిర్ధారించడంతో… ఈ నెల 10 నుంచి శ్రీలంకతో జరగబోయే మూడు వన్డేల సిరీస్కు అతణ్ని జట్టులోకి ఎంపిక చేశారు.
2022లో గాయం కారణంగా కొన్ని నెలల పాటు క్రికెట్ ఆడలేదు… బుమ్రా. సెప్టెంబరులో తిరిగి జట్టులో చేరినా… కొద్దిరోజులకే మళ్లీ గాయపడి టీ-20 ప్రపంచకప్తో పాటు చాలా సిరీస్లకు దూరమయ్యాడు. ఈ ఏడాది అక్టోబర్లో వన్డే ప్రపంచకప్ జరగనుండటంతో… బుమ్రాను టీ-20లకు దూరంగా ఉంచి… ఎక్కువగా వన్డేలే ఆడించే అవకాశముంది. అంతేకాదు… ఐపీఎల్లోనూ బుమ్రాపై ఎక్కువ భారం పడకుండా అతడిపై జాతీయ క్రికెట్ అకాడమీ ప్రతినిధులు ఓ కన్నేసి ఉంచబోతున్నారు.
టీ-20 ప్రపంచకప్కు బుమ్రా దూరమయ్యాక… ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేశారు. డబ్బులొచ్చే ఐపీఎల్ ఆడుతూ… గాయం సాకుతో దేశం కోసం ఆడాల్సిన కీలక టోర్నీలకు దూరంగా ఉంటున్నాడని మండిపడ్డారు. దానికి తగ్గట్టే ఆధారాలు కూడా బయటికి తీశారు. 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన బుమ్రా… ఇప్పటిదాకా 30 టెస్ట్లు, 72 వన్డేలు, 56 టీ-20లు మాత్రమే ఆడాడు. ఆరేళ్ల కెరీర్లో బుమ్రా ఆడిన మ్యాచ్లు ఇన్నేనా? అని ఫ్యాన్స్ చాలా అసహనం వ్యక్తం చేశారు. అదే ఐపీఎల్ తీసుకుంటే… 2013 నుంచి లీగ్ లో ఆడుతున్న బుమ్రా… ప్రతి సీజన్లోనూ ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా… ఏకంగా 120 మ్యాచ్లు ఆడాడు. దాంతో… ఐపీఎల్పై ఉన్న శ్రద్ధ మెగా టోర్నీల మీద లేదా? అని బుమ్రాపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ఐపీఎల్ సీజన్ తర్వాత మళ్లీ బుమ్రా వన్డే వరల్డ్కప్కు దూరమైతే మాత్రం… మరోసారి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురికాక తప్పదు.