BCCI on Shreyas Iyer Central Contract(Latest sports news telugu): టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ నెమ్మదిగా ఊపిరి పీల్చుకోనున్నాడు. ఎందుకంటే రంజీట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో శ్రేయాస్ 95 పరుగులు చేసి ఆదుకున్న తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నిజానికి శ్రేయాస్ ఆడకపోతే విదర్బ గెలిచేదని అంటున్నారు. ఎందుకంటే విదర్భ అప్పటికే 368 పరుగులు చేసింది. అదే లక్ష్యం తక్కువగా ఉంటే, మరింత నిదానంగా ఆడేవారని, వికెట్లు కాపాడుకుంటూ ఆడేవారని సీనియర్లు వ్యాక్యానిస్తున్నారు.
ముంబై జట్టు ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించిన శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. అందుకే చివరి రోజు గ్రౌండ్ లోకి వెళ్లలేదు. పరుగులు చేయడంతో మళ్లీ నొప్పి తిరగబెట్టింది. ఇవన్నీ చూసిన బీసీసీఐ, తామెక్కడో తొందరపడ్డామనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అలా కష్టకాలంలో ఆదుకున్నవాళ్లే జట్టుకి కావల్సి ఉంటుంది. ఆ పని ఇప్పుడు శ్రేయాస్ చేశాడని అంటున్నారు.
Also Read: ముంబై రంజీ ట్రోఫీ కైవసం.. శ్రేయాస్ అయ్యర్ డ్యాన్స్ వీడియో వైరల్ ..
ఇకపోతే సీనియర్లు కూడా బీసీసీఐ నిర్ణయంపై మండిపడ్డారు. మరి గాయపడ్డ రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యాలను డైరక్టుగా ఎలా తీసుకున్నారు. వారెక్కడా రంజీలు ఆడలేదు. చక్కగా ఐపీఎల్ కి వచ్చారని దుమ్మెత్తిపోస్తున్నారు . ఈ నేపథ్యంలో బీసీసీఐ అవలంబించే ద్వంద్వ విధానాలపై ప్రజల్లో అపోహలు బయలుదేరడంతో బీసీసీఐ పునరాలోచనలో పడిందని అంటున్నారు.
ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్న అయ్యర్ చివరికి రంజీ ట్రోఫీ అందుకునేటప్పుడు వారితో కలిసి సంబరాలు చేసుకున్నాడు. అలాగే కోల్ కతా నైట్ రైడర్స్ తో కూడా కలుస్తాడని అంటున్నారు. మరి తొలి రెండు మ్యాచ్ లకి దూరంగా ఉంటాడా? ఆ సమయానికి నొప్పి లేకపోతే ఆడతాడా? అనేది ఇంకా స్పష్టత లేదు.
ఒకవేళ బీసీసీఐ నిజంగానే శ్రేయాస్ కి తలుపులు తెరిస్తే క్రికెట్ అభిమానులు అందరూ సంతోషిస్తారు. అంతేకాదు రేపు టీ 20 ప్రపంచకప్ టీమ్ లో శ్రేయాస్ ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.