Mohammed Shami : టీ 20 ప్రపంచకప్ నకు ముందు టీమ్ ఇండియాను బలోపేతం చేసే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తోంది. 14 నెలల తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీలను జట్టులోకి తీసుకున్న టీమ్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై ఫోకస్ పెట్టింది. తనతో ఒక మీటింగ్ పెట్టాలని భావిస్తోంది.
టీ 20 ప్రపంచకప్ లోకి మహ్మద్ షమీని తీసుకోవాలని బీసీసీఐ ఆలోచనతో ఉంది. అందుకు తగినట్టుగానే షమీ కూడా ఇటీవల తన మనసులో మాట బయటపెట్టాడు. నా గాయం తగ్గుముఖం పట్టింది. త్వరలోనే ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో పాల్గొంటాను. తర్వాత ఐపీఎల్ ఉంటుంది. అక్కడ టీ 20 ఫార్మాట్ లయను అందుకోవచ్చునని తెలిపాడు. నా పెర్ ఫార్మెన్స్ మెరుగుపరుచుకోడానికి, లోపాలు తెలుసుకోడానికి ఉపయోగపడుతుందని తెలిపాడు.
అయితే ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు? అలాగే బీసీసీఐ ప్రణాళికలు ఎలా ఉన్నాయో కూడా నాకు తెలీదు. కానీ టీ20 ప్రపంచకప్ లో నా సేవలు అవసరమని భావిస్తే మాత్రం, తప్పకుండా ఆడతాను, వందకు రెండు వందల శాతం దేశం కోసం కష్టపడతానని 33 ఏళ్ల షమీ తెలిపాడు.
కొన్నేళ్లుగా మహ్మద్ షమీపై వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటోందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అలాగే వారు ఏమంటారంటే… అన్ని ఫార్మాట్లలో షమీని ఆడించాలని అనుకోవడం సరికాదు. కాకపోతే టీ20ల పట్ల అతడి ఆలోచన ఎలా ఉందో తెలుసుకోవాలని సెలక్టర్లు అనుకుంటున్నారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. సౌతాఫ్రికా పర్యటనలోనే రోహిత్, విరాట్ లతో పాటు షమీతో చర్చించాల్సింది. కానీ షమీ ఆ పర్యటనకు వెళ్లకపోవడంతో కుదరలేదని తెలిపారు.
ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్ లకి కూడా షమీ అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ పర్యవేక్షణలో షమీ ఉన్నాడు. అక్కడ వాళ్లిచ్చే రిపోర్టు ఆధారంగా మహ్మద్ షమీ ఇంగ్లాండ్ తో జరిగే తర్వాత టెస్ట్ మ్యాచ్ లకి అందుబాటులో ఉంటాడా?లేదా? అనేది తేలుతుంది. ఇక కుదరకపోతే ఏకంగా టీ 20 వరల్డ్ కప్ కే అందుబాటులోకి వస్తాడని అంటున్నారు.