BCCI Supports Pant: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రికెటర్ రిషబ్ పంత్ను బీసీసీఐ అనుక్షణం కనిపెట్టుకుని ఉంటోంది. అతనికి అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తోంది. అతను మరో ఏడాది పాటు ఆడే అవకాశం లేకపోయినా… ఐపీఎల్ వేలంలో అతనికి వచ్చిన మొత్తం రూ.16 కోట్లు చెల్లిస్తామని ప్రకటించింది… బీసీసీఐ.
తీవ్ర గాయాల పాలు కావడంతో… పంత్ ఈ ఏడాది ఐపీఎల్ సహా, వచ్చే వన్డే ప్రపంచకప్ ఆడేది కూడా అనుమానమే. అయితే ఐపీఎల్లో ఆడకపోయినా… వేలంలో అతనికి వచ్చిన మొత్తం అయిన రూ.16 కోట్లు ఇస్తోంది… బీసీసీఐ. రూ.5 కోట్ల సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న పంత్కు… బీమా ద్వారా ఈ మొత్తం రాబోతోంది. బీసీసీఐతో సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లందరికీ బీమా ఉంటుంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం… ఐపీఎల్ ఆడే ఆటగాళ్లు గాయం కారణంగా టోర్నీకి దూరమైతే… వేలంలో అతను పలికిన ధరను ఫ్రాంచైజీ కాకుండా బీసీసీఐ చెల్లిస్తుంది. ఆ తర్వాత బీమా కంపెనీ ఆ డబ్బుని బీసీసీఐకి అందిస్తుంది. పంత్ ఆడకపోయినా… బీమా ద్వారా అతనికి డబ్బు వచ్చేలా చేసినందుకు అభిమానులంతా బీసీసీఐని కొనియాడుతున్నారు.
మరోవైపు… ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పంత్ క్రమంగా కోలుకుంటున్నాడు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో… పంత్ కుడి మోకాలి లిగ్మెంట్కు చేసిన ఆపరేషన్ విజయవంతమైంది. అతను కోలుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఒకవేళ అప్పటికీ కోలుకోకపోతే సెప్టెంబరులో జరిగే ఆసియా కప్తో పాటు ఆ తర్వాత జరిగే వన్డే ప్రపంచకప్కూ దూరమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పంత్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ టీమ్ విభాగాధిపతి డాక్టర్ పార్దివాలా ఆధ్వర్యంలో పంత్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. ఒకవేళ ఇంకా మంచి చికిత్స అవసరమైతే… పంత్ను లండన్ పంపేందుకు కూడా సిద్ధంగా ఉంది… బీసీసీఐ.