BCCI Serious : టీ20 వరల్డ్కప్ టోర్నీలో భారత క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శనతో బీసీసీఐ ప్రక్షాళనకు దిగింది. ఈ ఓటమికి సెలక్షన్ కమిటీని బాధ్యులను చేసింది బీసీసీఐ. టీం ఎంపికలో డొల్లతనం బయటపడడంతో.. కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. జట్టు చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ నేతృత్వంలోని నలుగురు సభ్యుల సీనియర్ జాతీయ సెలక్షన్ కమిటీని బీసీసీఐ తొలగించింది. ప్రస్తుతం చేతన్ శర్మ నార్త్ జోన్ నుంచి, హర్విందర్ సింగ్ సెంట్రల్ జోన్ నుంచి సునీల్ జోషి సౌత్ జోన్ తరఫున, దేబాసిష్ మొహంతి ఈస్ట్ జోన్ నుంచి సీనియర్ జాతీయ సెలెక్టర్లుగా ఉన్నారు. బీసీసీఐ బాస్ గా సౌరవ్ గంగూలీ ఉన్న టైంలో కొందరు 2020లో, మరికొందరు 2021లో బాధ్యతలు చేపట్టారు.
భారత జట్టు సెలక్షన్ కమిటీని తొలగించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొత్త సెలెక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. సీనియర్ పురుషుల జట్టును ఎంపిక చేసేందుకు ఐదుగురు సెలెక్టర్లు కావలెను అంటూ అందులో పేర్కొంది. అందుకోసం కొన్ని అర్హతలు కూడా నిర్దేశించింది. దరఖాస్తుదారులు కనీసం 7 టెస్టు మ్యాచ్ లు కానీ, కనీసం 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు లేదంటే 10 వన్డేలు అలాగే 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన వారిని అర్హులుగా ప్రకటనలో వివరించింది. ఆట నుంచి ఐదేళ్ల కిందటే రిటైరై ఉండాలని స్పష్టం చేసింది. అలాగే మరే ఇతర క్రికెట్ కమిటీల్లో సభ్యులై ఉండరాదని తెలిపింది. నవంబరు 28 తేదీ సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలని బీసీసీఐ స్పష్టం చేసింది.
తాజా పరిణామాలను బట్టి చూస్తే టీమిండియాలో కూడా భారీ మార్పులు ఖాయంగానే కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే టి20 కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను పొట్టి ఫార్మాట్ కు పూర్తిస్థాయి సారథిగా నియమించేందుకు సిద్ధమైనట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఇక రోహిత్ తో పాటు సీనియర్లు కోహ్లీ, షమీ, భువీ, కార్తీక్, అశ్విన్ ల కు టీ20ల నుంచి ఉద్వాసన పలకడానికి బీసీసీఐ సిద్దమైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటికిప్పుడు బోర్డు ఆ సాహసం చేస్తుందా లేదంటే మరికొంతకాలం నిరీక్షిస్తుందో చూడాలి