Mohammed Shami : ఇన్నాళ్లూ ఆడింది ఒకెత్తు…ఒక్క వరల్డ్ కప్ లో ఆడింది ఒకెత్తుగా మహ్మద్ షమీ జీవితం మారిపోయింది. 33 ఏళ్ల మహ్మద్ షమీ కెరీర్ ప్రారంభం నుంచి చూస్తే ఇంత విధ్వంసకరమైన బౌలింగ్ ఎప్పుడూ చూడలేదు. వన్డే వరల్డ్ కప్ 2023 లో నాలుగు మ్యాచ్ లు బెంచ్ మీద కూర్చోబెట్టారనే కోపమో, కసి, ఉద్రేకమో తెలీదు. ఆ అవకాశం వచ్చిన మ్యాచ్ ల్లో మామూలుగా ఆడలేదు.
షమీ ఆడిన మ్యాచ్ ల్లో అన్ని దేశాల బ్యాటర్లను కూడా నిప్పులు చెరిగే బంతులతో వణికించాడు. చివరకు అత్యధిక వికెట్లు 24 తీసిన బౌలర్ గా చరిత్రకి ఎక్కాడు. ఇందులో ఐదు వికెట్ల ప్రదర్శనలు, సెమీఫైనల్ లో ఏడు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. షమీ తో పాటు మరో 16మంది క్రీడాకారుల పేర్లను అర్జున అవార్డు కోసం ప్రతిపాదించినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో అర్జున అవార్డు కోసం బీసీసీఐ. మహ్మద్ షమీ పేరును కేంద్ర క్రీడామంత్రిత్వశాఖకు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇంకా అత్యున్నతమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారం కోసం బ్యాడింటన్ ప్లేయర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలు నామినేట్ అయ్యారు.
ఫైనల్ మ్యాచ్ రోజున సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లారు. అక్కడందరితో పాటు షమీ అని పేరు పెట్టి పిలిచి, మరీ భుజం తట్టి ఓదార్చారు. ఎంత గొప్ప అనుభూతి అది…అలాంటి సందర్భాన్ని కూడా మన భారతదేశ క్రీడాధికార మంత్రిత్వ శాఖ విస్మరించింది. మొదట అర్జున అవార్డుల్లో షమీ పేరుని పరిగణలోకి తీసుకోలేదు. అంటే అవార్డులిచ్చే ప్రక్రియ ఎంత గుడ్డిగా చేస్తున్నారనేదానికి పరాకాష్ట అని చెప్పాలి.
విషయం తెలిసిన బీసీసీఐ వెంటనే స్పందించింది. స్పెషల్ రిక్వెస్ట్ చేయడంతో చివరి నిమిషంలో మహ్మద్ షమీ పేరు చేర్చారు. దీనిపై నెట్టింట అప్పుడే ట్రోలింగ్స్ మొదలయ్యాయి. ఆటగాళ్ల విషయంలో రాజకీయాలు చేయడం వల్లే 140 కోట్ల మంది ఉన్న ప్రజల్లో ఒలింపిక్స్ లో సరైన ప్రతిభ చూపించలేకపోతున్నారనే ట్రోలింగ్స్ అప్పుడే మొదలయ్యాయి.