IND vs ENG : ఇంగ్లాండ్ తో ప్రారంభమయ్యే తొలి రెండు టెస్టులకు విరాట్ కొహ్లీ దూరమైన సంగతి తెలిసిందే. అయితే తన ప్లేస్ ను భర్తీ చేసేందుకు నలుగురి పేర్లు తెరమీదకు వస్తున్నాయి. అయితే అధికారికంగా ఇంకా ఎవరి పేరు ప్రకటించలేదు. కానీ అనూహ్యంగా రింకూ సింగ్ పేరు తళుక్కుమని మెరిసేలా ఉంది.
రంజీట్రోఫీలో ఉత్తరప్రదేశ్ తరపున ఆడుతున్న రింకూ సింగ్ ని కొహ్లీ ప్లేస్ లో బ్యాకప్ గా తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకు తగినట్టుగా ఇంగ్లాండ్ లయన్స్ తో జరుగుతున్న అనధికార రెండో టెస్ట్ సిరీస్ కి రింకూని ఉన్నపళంగా ఎంపిక చేశారు. నిజానికి భారత్ ఏ జట్టులో మూడో టెస్ట్ కి మాత్రమే తనని ఎంపిక చేశారు. ఇప్పుడు రెండో టెస్ట్ కి ప్రమోట్ చేశారు.
కారణం ఏమిటంటే, ఒకవేళ విరాట్ కొహ్లీ మిగిలిన మూడు టెస్ట్ లకి కూడా అందుబాటులో లేకపోతే రింకూ సింగ్ కి ప్రమోషన్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇంగ్లాండ్ బజ్ బాల్ వ్యూహం అమలు చేస్తుందని తెలిడంతో, టీమ్ ఇండియా కూడా హిట్టర్లకు అవకాశాలిస్తోంది. అయితే ప్రస్తుతం రింకూ సింగ్ తన ఫామ్ తో టీ20ల్లో ఆకట్టుకుంటున్నాడు.
కోహ్లి స్థానానికి రింకూ సింగ్ కాకుండా సీనియర్ ప్లేయర్ పుజారాతో పాటు రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం రంజీట్రోఫీలో సౌరాష్ట్రలో జట్టులో పుజారా, భారత్-ఎ జట్టులో యువ ప్లేయర్లు రజత్, సర్ఫరాజ్ ఉన్నారు.
రజత్, సర్ఫరాజ్లలో ఒకరు కోహ్లి ప్లేస్లో టీమిండియాలోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. కాకపోతే వీరిని దాటి రింకూ సింగ్ వెళ్లిపోయాడని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పుజారా రంజీల్లో డబుల్ సెంచరీ సాధించి ఉన్నాడు. తనకి అవకాశం ఇస్తారా? లేదా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఈ నేపథ్యంలో మూడు ఫార్మాట్లకు రింకూ సింగ్ ని సిద్ధం చేసేలా బీసీసీఐ కీలక చర్యలు చేపడుతోందనేది అర్థమవుతోంది. రింకూని తక్షణమే భారత్-ఎ జట్టుతో చేరమని బీసీసీఐ అతడికి మంగళవారం కీలక ఆదేశాలు జారీచేసింది. ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో జరగనున్న రెండో టెస్టుకు ఎంపిక చేస్తూ రింకూకి కబురు పంపింది.