Bangladesh vs Sri Lanka : ఢిల్లీలో నేడు శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 మ్యాచ్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు మ్యాచ్ జరుగుతుందా? లేదా? అని అనుకుంటున్నారు. ఢిల్లీలో శీతాకాలం మొదలైందంటే కాలుష్యం ఎలా ముంచేస్తుందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అదే పరిస్థితి అక్కడ నెలకొంది. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో మంచుతో కూడిన కాలుష్యం దిగిపోతోంది. దీంతో రెండు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీసు సెషన్స్ రద్దు చేసుకున్నాయి.
అయితే బంగ్లాదేశ్ ఆటగాళ్లు మాత్రం మాస్క్ లు కప్పుకుని రెండోరోజు ట్రెయినింగ్ సెషన్లో సాధన చేశారు. శ్రీలంక మాత్రం పూర్తిగా ఇండోర్ కే పరిమితమైపోయింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఐసీసీ మ్యాచ్ లు నిర్వహించేటప్పుడు ఢిల్లీకి శీతాకాలంలో కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే వన్డే వరల్డ్ కప్కి సంబంధించి విశాఖపట్నానికి ఒక్క మ్యాచ్ కేటాయించలేదు. అదేదో ఇక్కడే చేయొచ్చు కదా! అని కూడా అంటున్నారు.
అసలు మంచు, కాలుష్యం కలిసి కప్పేస్తుందని తెలిసి ఢిల్లీకి ఎలా అనుమతిచ్చారని ప్రశ్నిస్తున్నారు. మ్యాచ్ లు షెడ్యూల్ చేసేటప్పుడు ఇవన్నీ గుర్తించరా? అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఉత్తరభారతదేశం వాళ్ల ఆధిపత్యమే సాగుతోందని సీరియస్ అవుతున్నారు.
ప్రస్తుతం శ్రీలంక-బంగ్లాదేశ్ ఆటగాళ్ల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహించే రోజునే, ఆడలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. బీసీసీఐ కూడా హడావుడిగా చేసిన పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నంలో పడింది. వెంటనే దేశంలోని ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రణ్ దీప్ గులేరియాను ఆటగాళ్ల వద్దకు పంపించింది.
ఎందుకంటే ఏర్పాట్లలో ఏ మాత్రం లోపాలున్న, పోటీలు నిర్వహించే దేశంపై విమర్శలు రేగుతాయి. ఇక్కడ మెగా టోర్నమెంటు, క్రికెట్ ఇవేవీ హైలైట్ కావు. భారత్ లో సౌకర్యాలు సరిగా లేవు, ఎవరిని పట్టించుకోరనే మాట వచ్చిందంటే అదెంతో దూరం వెళ్లిపోతుంది. భారతదేశానికి వచ్చే ఇతర దేశాధ్యక్షులు కూడా ఆలోచనలో పడతారు.
అందుకని మ్యాచ్ నిర్వహించడం కన్నా ఆటగాళ్ల బాగోగులు చూడటం, వారి దేశపు ఆహార నియమాలు, అక్కడ వండే వంటలు, అవన్నీ ముందుగానే తెప్పిస్తారు. ఆయా దేశ ఆటగాళ్లకు తగినట్టుగా అక్కడ నుంచి ప్రముఖ చెఫ్ లు వస్తారు. ఆటగాళ్లు బసచేసే హోటళ్లలో వీరికి సకల సౌకర్యాలు అందుతాయి. అందుకనే బీసీసీఐ కంగారు పడిపోతోంది. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం మైదానం, వాతావరణం, వర్షం కాకుండా ఇంకా మరే ఇతర పరిస్థితులైనా ఆటకు అనువుగా లేవని, లేదా ప్రమాదకరంగా ఉన్నాయని అంపైర్లు భావిస్తే, వాళ్లకు ఆటను ఆపే అధికారం ఉంటుంది. లేదా ప్రారంభించకుండా కూడా ఉండొచ్చు.