Bangladesh batsmen break 17-year-old record : టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ బ్యాటర్లు మెహదీ హసన్ మిరాజ్, మహ్మదుల్లా… అనేక రికార్డులు బద్దలు కొట్టారు. 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్న ఇద్దరు బ్యాటర్లు… ఏడో వికెట్కు ఏకంగా 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్తో వన్డేల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన బంగ్లా జోడీగా మిరాజ్, మహ్మదుల్లా రికార్డులకెక్కారు. గతంలో 2014 ఆసియాకప్లో అనముల్ హక్, ముష్ఫికర్ రహీమ్ భారత్ మీద 133 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ రికార్డును మిరాజ్, మహ్మదుల్లా జోడీ బద్దలు కొట్టింది.
ఇక భారత్పై వన్డేల్లో ఏడో వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా మెహదీ హసన్, మహ్మదుల్లా నిలిచారు. 2005లో దంబుల్లా వేదికగా జరిగిన వన్డేలో… శ్రీలంక బ్యాటర్లు మహేల జయవర్ధనే, ఉపుల్ చందన భారత్పై ఏడో వికెట్కు 126 పరుగుల పార్టనర్షిప్ నమోదు చేశారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా… ఈ 17 ఏళ్ల రికార్డును నిన్నటి మ్యాచ్లో మిరాజ్, మహ్మదుల్లా బద్దలు కొట్టారు. ఇక ఈ మ్యాచ్లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన మిరాజ్… 8 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ సాధించిన రెండో బ్యాటర్గా రికార్డులకెక్కాడు. 2021లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో ఐర్లాండ్ బ్యాటర్ సిమీ సింగ్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి శతకం బాదాడు.
టీమిండియాపై మెహిదీ హసన్ మిరాజ్ 83 బంతుల్లోనే 4 సిక్సర్లు, 8 ఫోర్లతో సెంచరీ కొట్టి నాటౌట్గా నిలవగా… మహ్మదుల్లా 96 బంతుల్లో 7 ఫోర్లతో 77 పరుగులు చేశాడు. వీళ్లిద్దరూ అద్భుతంగా ఆడటంతో… వందకో, 120 పరుగులకో ఆలౌట్ కావాల్సిన బంగ్లాదేశ్… నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది.