Ayodhya Ram Mandir : భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా అయ్యోధ్యలో నిర్మితమైన భవ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి.. టీమిండియా ప్లేయర్లు విరాట్ కోహ్లీ, అనుష్కశర్మ దంపతులు, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్ తదితరులకు ఆహ్వానాలు అందాయి. జనవరి 22న ఆయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది.
ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తర్ప్రదేశ్ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీలతో పాటు ఇంకా రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.
భారీ ఎత్తున రామభక్తులు దేశ విదేశాల నుంచి ప్రత్యేకంగా తరలి రానున్నారు. వీరందరికీ భారీ ఎత్తున శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది. హోటళ్లు, లాడ్జీలు అన్నీ బుక్ అయిపోయాయి. దూరప్రాంతాల నుంచి వచ్చేవాళ్లు చాలామంది బయలుదేరిపోయి అయోధ్య చేరుకుంటున్నారు. అప్పుడే అక్కడ పండగ వాతావరణం మొదలైంది. రామ సంకీర్తనలతో అయోధ్య ప్రాంగణం మార్మోగిపోతోంది.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన ఆహ్వాన పత్రికను దేశంలోని ప్రముఖులందరి ఇళ్లకు ట్రస్ట్ సభ్యులు, వాలంటీర్లు వెళ్లి అందిస్తున్నారు. దేశంలోని సుమారు 7 వేల మంది సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానిస్తోంది. అత్యంత సుందరంగా రూపొందించిన ఆహ్వాన పత్రికలో దేవాలయం విశిష్టత, ఆకట్టుకునే శ్రీరాముడి వర్ణనలు ఉన్నాయి.
ఆనాడు రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ వ్యక్తులు వారి వివరాలు, ఆనాటి ముఖ్య సంఘటనలను హైలైట్ చేసే ఒక బుక్ లెట్ ను ఈ కార్డుతో పాటు ప్రత్యేకంగా విడిగా అందిస్తున్నారు. ఇప్పటికే విమానాశ్రయం, రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితరవన్నింటినీ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో తీర్చిదిద్దారు.
రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని ఇం ఘనంగా చేయడంతో ప్రతిపక్ష పార్టీలన్నీ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదంతా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోదీ చేస్తున్నారని, ప్రజలని తమవైపునకు తిప్పుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇదంతా ఈవెంట్ మేనేజ్మెంట్ లాంటిదని, ప్రజల సెంటిమెంట్ ని తమవైపునకు తిప్పుకుంటున్నారని తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.