INDW Vs AUSW 3rd T20i : ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో టీ 20లో టీమ్ ఇండియా అమ్మాయిలు ఓడి, సిరీస్ కోల్పోయారు. మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. సిరీస్ గెలవాలంటే తప్పక విజయం సాధించాల్సిన మ్యాచ్ లో అమ్మాయిలు ఓటమి పాలై నిరాశపరిచారు.
టెస్ట్ మ్యాచ్ లో గెలిచిన టీమ్ ఇండియా తర్వాత జరిగిన వన్డే సిరీస్ లో 3-0తో, టీ 20 సిరీస్ 1-2 తేడాతో ఓటమిపాలై, ఆస్ట్రేలియాకి అప్పగించింది. సొంత గడ్డపై ఓటమి పాలవడం విచారకరమని సీనియర్లు వ్యాక్యానిస్తున్నారు. కనీసం పోరాట పటిమ చూపించలేదని విమర్శిస్తున్నారు.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన టీమ్ ఇండియా ఓపెనర్లు బాగానే ఆడారు. షెఫాలీ వర్మ 17 బంతుల్లో 26 పరుగులు, స్మృతి మంధాన రెండు ఫోర్లు, ఒక సిక్సర్ తో 29 పరుగులు చేసి భారత్ కి శుభారంభాన్ని ఇచ్చారు. కాకపోతే తర్వాత వచ్చిన వారు దానిని అందిపుచ్చుకోలేదు. నెమ్మదిగా ఆడారు.
ఇక కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతోంది. తన నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ ఈ సిరీస్ ల్లో రాలేదు. చివరికి రిచా ఘోష్ (34) ఫాస్ట్ గా ఆడటంతో 6 వికెట్ల నష్టానికి టీమ్ ఇండియా 147 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో సదర్లాండ్ 2, గార్డ్నర్ 1, వెరేహమ్ 2, మెగాన్ స్కట్ 1 వికెట్ తీశారు.
148 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఎంతో జాగ్రత్తగా ఆడింది. ఓపెనర్లు టీమ్ ఇండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 10 ఓవర్ల వరకు ఒక్క వికెట్టు పడలేదు. ఓపెనర్ అలీసా హెలీ (55), బెత్ మూనీ (52) హాఫ్ సెంచరీలతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాదు మొదటి వికెట్ కి 85 పరుగులు జోడించాక తొలి వికెట్ పడింది.
తర్వాత వెంటవెంటనే మరో రెండు వికెట్లు పడ్డాయి. కానీ అప్పటికే చేతులు కాలిపోయాయి. మెక్ గ్రాత్ (20), ఫోబీ లిచ్ ఫీల్డ్ (17) చేసి అవుట్ అయ్యారు. ఎలిస్ పెర్రీ డక్ అవుట్ అయ్యింది. ఇంకా 8 బంతులు ఉండగానే ఆస్ట్రేలియా విజయం సాధించి సిరీస్ ఎత్తుకుపోయింది. ఇలాగే టీమ్ ఇడితే రాబోవు మ్యాచ్ లు కూడా ఇలాగే ఉంటాయని, ముఖ్యంగా జట్టుని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు. టీమ్ ఇండియాలో పూజా వస్త్రాకర్ 2, దీప్తీ శర్మ 1 వికెట్టు పడగొట్టారు.