Australia won ODI series against England : T20 వరల్డ్ కప్ గెలిచామన్న ఇంగ్లండ్ ఆనందం వారం తిరక్కుండానే ఆవిరైంది. స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ను… మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో గెలుచుకుంది… ఆస్ట్రేలియా. దాంతో… T20 వరల్డ్ కప్ గ్రూప్-1లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం కాకుండా ఉంటే… తుది ఫలితం కచ్చితంగా మరోలా ఉండేదని అంటున్నారు… ఆసీస్ ఫ్యాన్స్.
తొలి వన్డేలో ఇంగ్లండ్ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆస్ట్రేలియా… రెండో వన్డేలో 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్… ఆరంభంలో తడబడింది. తొలి వన్డేలో తొలివికెట్ కు 147 పరుగులు జోడించిన వార్నర్, హెడ్… రెండో వన్డేలో మాత్రం విఫలమయ్యారు. వార్నర్ 16, హెడ్ 19 రన్స్ చేసి ఔటయ్యారు. ఆ తర్వాత స్మిత్, లబుషేన్ వికెట్ల పతనాన్ని అడ్డుకుని… చకచకా పరుగులు తీశారు. మూడో వికెట్ కు వంద పరుగులకు పైగా జోడించాక… 58 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర లబుషేన్ ఔటయ్యాడు. తర్వాతి బంతికే అలెక్స్ కూడా రషీద్కు వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత మార్ష్ చక్కని సహకారం అందించడంతో స్మిత్ ధాటిగా ఆడాడు. అయితే తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. 94 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర స్మిత్ పెవిలియన్ చేరగా… మార్ష్ సరిగ్గా 50 రన్స్ చేసి ఔటయ్యాడు. చివర్లో స్టొయినిస్, అగర్ కూడా ధాటిగా ఆడటంతో… 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది… ఆస్ట్రేలియా. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ మూడు వికెట్లు పడగొట్టగా… విల్లీ, వోక్స్కు చెరో రెండు వికెట్లు దక్కాయి.
281 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్కు… తొలి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ జేసన్ రాయ్, ఫస్ట్ వన్డేలో సూపర్ సెంచరీ చేసిన డేవిడ్ మలాన్… ఇద్దరూ డకౌటయ్యారు. ఆ తర్వాత మరో ఓపెనర్ సాల్ట్ కూడా ధాటిగా ఆడే ప్రయత్నంలో… 23 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఔటయ్యాడు. దాంతో.. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది… ఇంగ్లండ్. ఆ తర్వాత జేమ్స్, శామ్ ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని ఆడారు. నాలుగో వికెట్ కు 122 రన్స్ జోడించారు. హాఫ్ సెంచరీల తర్వాత ఇద్దరూ ఔటవడం, 13 పరుగుల వ్యవధిలోనే 4 వికెట్లు పడటంతో… ఇంగ్లండ్ ఓటమి ఖాయమైపోయింది. చివరికి 40 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయిన ఇంగ్లండ్… 208 పరుగులకు కుప్పకూలింది. ఆస్ట్రేలియా 72 పరుగుల తేడాతో గెలిచింది.
ఇంగ్లండ్తో తొలి రెండు వన్డేల్లో ఆస్ట్రేలియా ఆటతీరు చూసిన తర్వాత… ఆసీస్ అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. వర్షం కారణంగా T20 వరల్డ్ కప్ లో కొన్ని మ్యాచ్ లు రద్దైపోయి ఇంగ్లండ్ సెమీస్ చేరగలిగింది గానీ… లేకపోతే లెక్క వేరేలా ఉండేదంటున్నారు. సూపర్-12 దశలోనే కాదు… ఆ తర్వాత కూడా ఇంగ్లండ్ జట్టుకు ఆస్ట్రేలియా కచ్చితంగా షాకిచ్చి విజేతగా నిలిచేదని… వరుణుడి దెబ్బకు అంతా తారుమారైపోయిందని ఆసీస్ ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు.